రఘునాథపాలెం, డిసెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం పంచాక్షరి కాలనీ వెలుగుమట్లలో రూ.75 లక్షలతో నిర్మించనున్న తెలంగాణ సంక్షేమ పరిషత్ ఆపర కర్మ భవన నిర్మాణ పనులను రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ భవనానికి బ్రాహ్మణ సదనంగా నామకరణం చేయాలని కోరారు. స్థలాన్ని అందించిన దాత మాదిరాజు సీతారామారావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఏటా రూ.100 కోట్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు. హైదరాబాద్లో 6 ఎకరాల్లో ఇంద్ర భవనంలా బ్రాహ్మణ సదనం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు.
బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. హైదరాబాద్, సూర్యాపేటల్లో నిర్మించిన బ్రాహ్మణ సదనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, సుడా, ఏఎంసీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, లక్ష్మీప్రసన్న, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ వనం జ్వాలా నర్సింహారావు, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
రామాలయాన్ని దర్శించుకున్న రమణాచారి
ముదిగొండ, డిసెంబర్ 19: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ముత్తారం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉండగా స్థానికుడైన సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు ద్వారా విషయం తెలుసుకొని ఆయన ప్రత్యేకంగా వచ్చి పూజలు చేశారు.సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.