ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 19: నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థిక చేయూతనందించారు ఖమ్మంలోని శ్రీవిద్యానికేతన్ సీబీఎస్ఈ స్కూల్ అధినేత గొల్లపూడి రాంప్రసాద్. గోపాలపురానికి చెందిన విద్యార్థిని సూరారపు పూజితది నిరుపేద కుటుంబం. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారన్న కారణంతో ఆమె తండ్రి వారిని చిన్నతనంలోనే వదిలేశాడు. ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తల్లి తన కుమార్తెలను పోషిస్తోంది. చదువులో ముందుండే పూజిత.. గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. రేయింబవళ్లూ శ్రమించి నీట్లో ర్యాంకు సాధించి సిద్ధిపేటలోనిలో సీటు పొందింది. కానీ ఐదున్నరేళ్ల కోర్సు పూర్తి చేసేందుకు, అప్పటి వరకూ ఖర్చులు భరించేందుకు స్తోమత లేక నిరుత్సాహంతో ఉంది. ఈ విషయాన్ని గమనించిన శ్రీవిద్యానికేతన్ అధినేత రాంప్రసాద్ ఆ విద్యార్థిని కోర్సు మొత్తానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు సోమవారం ఆ విద్యార్థినికి ఇంటికెళ్లి.. ఫస్టియర్ ఫీజులు, ఇతర ఖర్చుల కోసం రూ.1.20 లక్షల చెక్కులను మంత్రి అజయ్కుమార్ చేతులు మీదుగా ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. పూజిత మంచి వైద్యురాలై ఈ ప్రాంత ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థినిని ఆదుకున్న గొల్లపూడి రాంప్రసాద్ను మంత్రి అభినందించారు. గొల్లపూడి సతీశ్, నాగభూషణం, మోహన్, నర్సింహ, అశోక్, రవి, గోపి, అలీసాహెబ్, వెంకన్న, శివరామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.