సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 19: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులకు పెద్దపీట వేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలు, అన్ని మతాలకూ సమాన ప్రాధాన్యం కల్పిస్తూ సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి పాస్టర్లకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పండుగలకూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాతినిథ్యం కల్పిస్తున్నారని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రేమవిందు ఏర్పాటు చేస్తున్నారని, కానుకలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. క్రైస్తవుల కోసం హైదరాబాద్లో క్రైస్తవ సంక్షేమ భవనాన్ని నిర్మించేందుకు ఇటీవలే శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. అనంతరం క్రైస్తవ సోదరులకు ప్రేమవిందు ఏర్పాటు చేశారు. కమిషనర్ సుజాత, ఏసీపీ వెంకటేశ్, సింగరేణి పీవో వెంకటాచారి, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలీ, అద్దంకి అనిల్, రఘు, కంటె నాగలక్ష్మి, తడికమళ్ల ప్రకాశ్రావు, అలవాల కరుణాకర్, రూత్ క్రిస్టియానా పాల్గొన్నారు.