ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 18: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ఒకటి రెండురోజుల్లో ట్రెజరీకి నిధులు విడుదల చేయనున్నది. సీఎంకేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. రైతులకు అండగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారు. అన్నంపెట్టే రైతు అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశంతో సీజన్కు ముందే రైతుబంధు సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నది. తొలుత ఎకరానికి సీజన్కు రూ.4 వేల చొప్పున అందించిన సర్కార్ తర్వాత రూ.5 వేలకు పెంచింది. ఈచొప్పున ఏటా రెండు సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3.10 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము అందుతున్నది.
సాగు పనులు వేగవంతం..
సర్కార్ సీజన్కు ముందే రైతుబంధు అందజేస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల చివరి వరకు సాగు పనులు పూర్తి కానున్నాయి. మరోవైపు ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేస్తున్నది. తొలుత సన్న, చిన్న కారు రైతుల ఖాతాల్లో సొమ్ములు జామ కానున్నాయి. రైతుబంధు జమ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే రైతులు వ్యవసాయశాఖ విస్తరణ అధికారులను సంప్రదించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
సకాలంలో పంటల పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రైతుల తరపున కృతజ్ఞతలు. యావత్ దేశ చరిత్రలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కార్ తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి పాలనలో వ్యవసాయం నిరదణకు గురైంది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎవుసాన్ని పండుగ చేశారు.
– అక్కినపల్లి వెంకన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్, ఖమ్మం రూరల్