అశ్వారావుపేట, డిసెంబర్ 18: ఓటు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో శరవేగంగా జరుగతోంది. బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 79.10 శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. బూత్ లెవెల్ అధికారులు గ్రామాల్లో నిత్యం ఓటర్ల వద్దకు వెళ్లి మరీ వారి ఓటు గుర్తింపు కార్డుకు ఆధార్ను అనుసంధానం చేస్తున్నారు. దీంతోపాటు ఓటరు కార్డులో ఫోటోతో పాటు తప్పులను సరిచేస్తున్నారు. ఓటరు కూడా నేరుగా ఆధార్ను అనుసంధానం చేసుకోవడానికి nvsp.in వెబ్సైట్లో ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ఈ ప్రక్రియను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 8,98,381 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 7,10,613 మంది ఓటర్లు తమ ఆధార్ను ఓటు కార్డుతో అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 1,87,768 మంది ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాల్సి ఉంది.
వెబ్సైట్ ద్వారా నేరుగా..
ఓటర్లు కూడా తమ ఓటు గుర్తింపు కార్డును నేరుగా తమ ఆధార్ను nvsp.in వెబ్సైట్లో అనుసంధానం చేసుకోవచ్చు. అంతేగాకుండా ప్లే స్టోర్లో ఓటరు హెల్ప్లైన్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని,.. అందులో ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ను నమోదు చేసి ఆధార్ను అనుసంధానం చేసుకోవచ్చు. ఆధార్ లేదా ప్రభుత్వం శాఖలు జారీ చేసిన ఏదైనా 10 గుర్తింపు కార్డుల్లో ఒక దానితో ఓటరు కార్డును అనుసంధానం చేసుకోవచ్చు.
బోగస్ ఓట్లకు చెక్..
ఓటరు జాబీతాలో బోగస్ ఓట్లకు చెక్ పెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించింది. దీనిలో బాగంగానే ఓటుకు ఆధార్ను అనుసంధానం చేస్తోంది. ఆధార్ను లింక్ చేయడం ద్వారా ఒక ఓటు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే సర్వర్లో డబుల్గా చూపుతుంది. దీనిద్వారా నకిలీ, బోగస్ ఓట్లను గుర్తించి తొలిగించేందుకు వీలవుతుంది. చాలా మంది ఓటర్లకు సొంత గ్రామాలతోపాటు తాము తాత్కాలికంగా నివసించే పట్టణాలు, నగరాల్లోనూ ఓట్లు ఉన్నాయి. ఇలాంటి డబుల్ ఓట్లను అధికారులు గుర్తించి తొలిగిస్తున్నారు. ఓటరు కార్డులో ఫొటోలు సక్రమంగా లేకున్నా కూడా వాటిని సవరిస్తున్నారు.
‘పేట’లో 83.11 శాతం..
జిల్లా వ్యాప్తంగా ఓటు గుర్తింపు కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియ 79.10 శాతం పూర్తయింది. ఆధార్ అనుసంధానంలో అశ్వారావుపేట నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,46,034 మంది ఓటర్లకు గాను 1,21,363 మంది ఓటర్లు తమ ఆధార్ను అనుసంధానం చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఓటు కార్డు – ఆధార్ అనుసంధానం 83.11 శాతం పూర్తయింది. రెండో స్థానంలో ఇల్లెందు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,04,936 మంది ఓటర్లకుగాను 1,64,669 మంది ఓటర్లు తమ ఓటుతో ఆధార్ను లింక్ చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ 80.35 శాతం పూర్తయింది. పినపాక నియోజకవర్గంలో 1,82,992 మంది ఓటర్లకు గాను 1,42,978 మంది తమ ఓటును ఆధార్తో లింక్ చేసుకున్నారు. 78.13 శాతం ప్రక్రియ పూర్తయింది. కొత్తగూడెం నియోజకవర్గంలో 2,24,073 మంది ఓటర్లకు గాను 1,73,849 మంది తమ ఓటును ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు. 77.59 శాతం ప్రక్రియ పూర్తయింది. చివరి స్థానంలో భద్రాచలం నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో 1,40,346 మంది ఓటర్లకు గాను 1,07,754 మంది ఓటర్లు తమ ఓటు కార్డును ఆధార్తో లింక్ చేసుకున్నారు. 76.78 శాతం ప్రక్రియ పూర్తయింది.
బోగస్ ఓట్ల ఏరివేతకే అనుసంధానం..
ఓటర్ల జాబితాలో నకిలీ, బోగస్ ఓట్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. ఓటు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. బోగస్ ఓట్ల ఏరివేత కోసం ఎన్నికల సంఘానికి ఓటర్లు సహకరించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ లేదా ప్రభుత్వ శాఖలు జారీ చేసిన ఏవైనా 10 గుర్తింపు కార్డులతో ఓటు కార్డును అనుసంధానం చేసుకోవాలి. బీఎల్వోలు ఇంటింటికీ వచ్చి ఓటుతో ఆధార్ను అనుసంధానం చేస్తున్నారు.
-చల్లా ప్రసాద్, తహసీల్దార్, అశ్వారావుపేట