సత్తుపల్లి, డిసెంబర్ 16: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో అండగా నిలుస్తూ నిరు పేదల్లో భరోసా నింపుతోంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్వో రాష్ట్ర ప్రభుత్వం కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. అత్యవసరమైన సమయాల్లో ముందుగానే బాధితులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లు అందజేస్తుండడంతో వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వారు ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సీఎం సహాయనిధితో వైద్యసేవలు అందుతుండడంతో వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 2019 జనవరి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 3,011 మందికి రూ.18 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందింది.
సీఎం సహాయనిధితో పునర్జన్మ పొందిన లబ్ధిదారులు రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వివిధ రకాల వ్యాధులతో చికిత్స పొందుతున్న రోగులకు, ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోంది. గతంలో నిరుపేదలు ఇలా వైద్యసేవలు చేయించుకునే స్థోమత లేక మృత్యువాతకు గురయ్యేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయ నిధి నుంచి మరిన్ని నిధులు వెచ్చిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధిక మందిని ఆదుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన లేదా పొందుతున్న తెల్లరేషన్కార్డు దారులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
3,011 మందికి రూ.18 కోట్ల సాయం..
సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని లబ్ధిదారులకు 2019 జనవరి 1 నుంచి ఇప్పటివరకు 3,011 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన క్షతగాత్రులు, రోగుల కేస్ షీట్లు, డిశ్చార్జి సమ్మరీలు, వైద్య బిల్లులను పరిశీలించిన సీఎంఆర్ఎఫ్ ట్రస్టు ఆ మొత్తంలో సుమారు 30 శాతాన్ని లబ్ధిదారులకు అందిస్తోంది. ఇలా సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 3,011 మందికి రూ.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంజూరు చేయించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పునర్జన్మ..
నేను గుండెజబ్బుతో బాధపడుతుండేవాడిని. అత్యవసర సమయంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతుడినయ్యాను. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నా. రెండు నెలల అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందింది. ఎమ్మెల్యే స్వయంగా మా ఇంటికి వచ్చి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. -సింగపోగు రామారావు,దుద్దెపూడి, వేంసూరు మండలం
ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది..
మాది నిరుపేద కుటుంబం. ఆర్థిక స్థోమత సరిగా లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనారోగ్యం పాలయ్యాను. అప్పులు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందాను. తరువాత ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నాను. తరువాత ఆర్థిక సాయం మంజూరైంది. మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది.
-జుబ్బూరి మహేశ్, కందుకూరు, వేంసూరు మండలం
ముఖ్యమంత్రి సహాయ నిధి అందింది..
తీవ్రమైన కడుపునొప్పితో అనారోగ్యానికి గురయ్యాను. దానిని తాళలేక హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందాను. తరువాత కోలుకొని ఆరోగ్యవంతురాలినయ్యాను. ఆ తరువాత ఎమ్మెల్యే సండ్ర ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాను. నాకు సీఎంఆర్ఎఫ్ మంజూరైంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటా.
-విస్సంపల్లి ముత్తమ్మ, కందుకూరు,వేంసూరు మండలం
పేదలకు వరం.. సీఎం సహాయనిధి..
ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటికే ఎంతో మంది లబ్ధిపొందారు. నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటివరకు 3,011 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.18 కోట్ల మేర సహాయం అందించాం. ఇకపై కూడా వివిధ రుగ్మతలతో బాధపడే నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా సాయం అందేలా కృషిచేస్తా.
-ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి