సత్తుపల్లి రూరల్/ పెనుబల్లి, డిసెంబర్ 16: భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. మండలంలోని రైతులకు నూతనంగా మంజూరైన పట్టాదారు పాస్ పుస్తకాలను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి గంగారం రైతువేదికలో ఆయన పంపిణీ చేశారు. బేతుపల్లి, గంగారం రెవెన్యూ పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన 97 మంది రైతులకు సంబంధించి పెండింగ్లో ఉన్న పట్టాదారు పాస్పుస్తకాలు తాజాగా మంజూరు కాగా శుక్రవారం వాటిని ఆయా రైతులుకు ఆయన అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 131, 133 సర్వేనెంబర్లలో రైతులకు పాస్పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా తాను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయి సర్వే నిర్వహించి రైతులందరికీ పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 80 శాతం మంది రైతులకు పట్టాలు అందాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అందుతాయని వివరించారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మధుసూదన్, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, సుభాషిణి, సుజాత, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, విజయనిర్మల, నర్సింహారావు, శ్రీనివాసరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మందపాటి శ్రీనివాసరెడ్డి, దుగ్గిరాల వాణి, పాకలపాటి శ్రీనివాసరావు, బేతిని శ్రీనివాసరావు, దేశిరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి మండలంలో..
పెనుబల్లి మండలంలోని మండాలపాడులో నూతనంగా మంజూరైన పాసు పుస్తకాలను లంకపల్లి, లంకాసాగర్, మండాలపాడు రైతులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. మండాలపాడులో 87 మంది రైతులకు పాసు పుస్తకాలు మంజూరయ్యాయని, ప్రస్తుతం 47 మంది రైతులకు వాటిని అందించామని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, రమాదేవి, కావూరి మహాలక్ష్మి, చెక్కిలాల లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పాఠాలు.. వారితోనే భోజనం..
మండలంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో పుస్తకాలు చదివించారు. అనంతరం వారికి పాఠాలు బోధించారు. తరువాత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. తొలుత పాఠశాల నిర్వహణ గురించి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆవరణలో కలియ తిరిగి కిచెన్ షెడ్, మరుగుదొడ్లను పరిశీలించారు. ఎదురుగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్తో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంఖ్య గురించి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.