మామిళ్లగూడెం, డిసెంబర్ 12: దళితబంధు పథకం ద్వారా మంజూరైన డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్పై సంబంధిత శాఖల అధికారులు, నోడల్ అధికారులతో నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకం కింద 573 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా.. ఇందులో 100 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు తెలిపారు. లుంపీ సిన్ వ్యాధి కారణంగా పశువుల రవాణాపై నిషేధం విధించడంతో డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ఆలస్యమయినట్లు చెప్పారు. ప్రస్తుతం నిషేధం తొలగించడంతో యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 126 మంది లబ్ధిదారులు పశువైద్యులతో కలిసి ఇప్పటికే హర్యానా, గుజరాత్లలో గేదెల సేకరణకు వెళ్లారని, సేకరణ అనంతరం తిరుగు ప్రయాణమయ్యారని వివరించారు. డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఇంకా 132 మంది లబ్ధిదారుల అంగీకారంతో ఉన్నారని, వీరిని కూడా పశువైద్యులతో కలిపి పశువుల సేకరణకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో అప్పారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ భాను, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.