తిరుమలాయపాలెం, డిసెంబర్ 12: మేనల్లుడి జన్మదిన వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పొరుగు జిల్లాకు వెళ్లారు. వేడుకలో సంబురంగా పాల్గొన్నారు. సందడి చేశారు. చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఆటోలో తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. ఇంతలోనే విధికి కన్ను కుట్టిందో ఏమో మృత్యశకటంలా బస్సు దూసుకొచ్చింది. దంపతుల ప్రాణాలను కబళించింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మిగిల్చింది. కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. ఆటోను బస్సు ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృతిచెందగా మరో ఆరుగురు గాయాల పాలైన ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన దువ్వా రమేశ్ (30), భార్య రేణుక (25), కుమారుడు కార్తీక్, హాసిని, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రామపురంలో సోదరి మమత ఇంటికి వెళ్లారు. మేనల్లుడి జన్మదిన వేడుకలో పాల్గొన్నారు.
వేడుక ముగిసిన తర్వాత ఇదే రోజు రాత్రి స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. ఆటో అనంతగిరి మండలంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఘటనలో రమేశ్, రేణుక అక్కడికక్కడే మృతిచెందగా దువ్వా భద్రయ్య, దువ్వా ఎర్రమ్మ, దువ్వా సుధ, తురక వెంకన్న, తురక దినేశ్, తురక రేణుకకు గాయాలయ్యాయి. వీరిలో భద్రయ్య, ఎర్రమ్మ, వెంకన్న పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగతా క్షతగాత్రులు ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. సోమవారం కుటుంబ సభ్యులు రమేశ్, రేణుక మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి ఒక్కసారిగా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందడం, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడం, పలువురు గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అనాథలుగా చిన్నారులు..
కార్తీక్, రేణుక దంపతుల మృతితో పిల్లలు కార్తీక్, హాసిని అనాథలు మిగిలారు. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తెలుసుకోలేని పసితనాన్ని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.