ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ అన్నదాతలు నడుం బిగించాలని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ 13 నెలలపాటు జరిగిన రైతాంగ ఉద్యమంలో అసువులు బాసిన రైతు అమరుల సంస్మరణ సభను బెంగళూరులో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్లచట్టాల పోరాటంలో అమరులైన 750 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ.. ఏడాదైనా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ వెళ్లి స్వయంగా అమరుల కుటుంబాలను పరామర్శించి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున రూ.22.50 కోట్లను అందించినట్లు గుర్తుచేశారు. అనంతరం బెంగళూరు ఫ్రీడం పార్క్లో 20 రోజులుగా చెరుకు రైతులు చేస్తున్న నిరవధిక ధర్నాలో చెరుకు రైతు సంఘం నాయకులు శాంతరాము, కేరళ రైతు నాయకుడు కేవీ బీజులతోపాటు నల్లమల కూడా పాల్గొన్నారు.