కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 11: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ విలావంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలను వాడుకుంటున్నారని, మైనర్లను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పేరుతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు ముగిసిన సందర్భంగా ఎస్పీ వినీత్ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిందని, ఆ పార్టీది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. మావోయిస్టులు ఆదివాసీల అభివృద్ధి నిరోధకులుగా మారి సంఘ విద్రోహక చర్యలతో వారిని పావులుగా వాడుకుంటూ ఛత్తీస్గఢ్ అడవుల్లో తలదాచుకుంటున్నారన్నారు. మావోయిస్టు నాయకులు ఆదివాసీలపై పాల్పడుతున్న దౌర్జన్యాలను గ్రహించిన ప్రజలు ఆ పార్టీకి సహకరించడం లేదన్నారు. ఛత్తీస్గఢ్లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్వహించే సమావేశాలకు తెలంగాణ గ్రామాల ప్రజల నుంచి ఎవరూ హాజరుకాకుండా తిరస్కరించారని తెలిపారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ ఆవిర్భావ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ప్రజల సహకారం కోల్పోయి భంగపడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ నాయకులు ఛత్తీస్గఢ్లోని అడవులను షెల్టర్ జోన్గా చేసుకుని తమ విలాసవంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలు, కాంట్రాక్టర్లు, రైతుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి వివిధ కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతా ల్లో నివసించే బాల, బాలికలను మావోయిస్టు పార్టీలోకి బలవంతంగా చేర్చుకోవడానికి కొంత కాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయన్నారు. తెలంగాణలో వారి ఉనికిని చాటుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాలకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మావోయిస్టు నాయకులు పాల్పడే చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు నాయకులు ప్రజల పట్ల వ్యవరిస్తున్న తీరుతో సొంత పార్టీలోని నాయకులు, సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించేందుకు లొంగుబాట పడుతున్నారని, మావోయిస్టు పార్టీది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు.