కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 9: పోలీస్ ఉద్యోగ నియామకాల కోసం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల ‘ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్’ జరుగుతున్న దృష్ట్యా ఎస్పీ వినీత్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ల ఆధారంగా నిబంధనల ప్రకారమే నియామకాలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ నోటిఫికేషన్లను అవకాశంగా మార్చుకుని కొందరు వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను తప్పుదోవపట్టించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. కష్టపడి చదువుకొని నోటిఫికేషన్ నియమావళి ప్రకారం అర్హతలు సాధించి ఉద్యోగాలు సాధించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిరుద్యోగులను మభ్యపెడుతున్న దళారీ వ్యవస్థపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, మోసాలకు పాల్పడేవారి డేటాను సేకరించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి ప్రభుత్వ ఉద్యోగ నియామకం పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతిభ చూపిన అభ్యర్థులే ఎంపికవుతారని అన్నారు. ఎవరైనా నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి, డబ్బులు అడిగితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.