మామిళ్లగూడెం, డిసెంబర్6 : సమాజంలో రోల్మోడల్గా నిలుస్తున్న హోంగార్డు ఆఫీసర్ల సేవలు అనిర్వచనీయమని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. 60వ హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం మంగళవారం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ముఖ్యఅతిథిగా హాజరై హోంగార్డు ఆఫీసర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్గా ఇనపనూరి వెంకటేశ్వర్లు వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్శాఖ విధులకు సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్కు ప్రస్తుత సమాజంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇదే స్పూర్తితో వృత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తూ.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, బ్లూకోల్డ్స్, పెట్రోల్ కార్ డ్రైవర్లు కార్యాలయాల భద్రత, రాత్రి గస్తీ, బందోబస్తు విధులు నిర్వహిస్తూ కీలకమైన బాధ్యతలు చేపడుతున్నారని కొనియాడారు. కొవిడ్ సమయంలోనూ ఫ్రంట్లైన్ వారియర్గా కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఇటీవల కాలంలో ఇద్దరు హోంగార్డులు గుండెపోటుతో మరణించడం దురదృష్టకరమని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విధిగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. అనంతరం వాలీబాల్, టాగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ క్రీడల్లో గెలుపొందిన హోంగార్డు ఆఫీసర్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా ఎండ్ ఆర్డర్ సుభాష్చంద్రబోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఏసీపీ రవి, సీఐలు చిట్టిబాబు, సర్వయ్య, రామకృష్ణ, అశోక్ కుమార్, ఆర్ఐలు శ్రీశైలం, రవి, తిరుపతి పాల్గొన్నారు.