మామిళ్లగూడెం, డిసెంబర్ 6 : పోలీసు కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ గురువారం నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. మంగళవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో ట్రైల్ రన్ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించే పరీక్షలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరవుతారని, వీరిలో పురుషులు 20,033 మంది, మహిళలు 4,700 మంది ఉన్నారని తెలిపారు.
పోలీస్ హెడ్క్వార్టర్స్ సమీపంలోని శివాలయం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్ నంబర్ ఇచ్చి పోలీస్ కల్యాణ మండపంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. 50మంది అభ్యర్థులను ఇద్దరు రన్నర్స్(కానిస్టేబుళ్లు) గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు తీసుకెళ్తారని తెలిపారు. అభ్యర్థుల డాక్యుమెంట్ పరిశీలన, బయోమెట్రిక్ తర్వాత ప్రతి అభ్యర్థి చేతికి చిప్తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్తో కూడిన ఆర్ఎఫ్ఐడీ బ్యాండ్ అటాచ్ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం పురుషుల అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళ అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారని, నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేసిన వారందరికీ ఎత్తు కొలుస్తారని వివరించారు. నిర్ణీత ఎత్తు ఉన్నవారిని తదుపరి లాంగ్జంప్, షాట్పుట్ పోటీలకు అనుమతిస్తారని తెలిపారు.
కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్(పీఎంటీ) ప్రతి ఈవెంట్లో అర్హత సాధించాలని అన్నారు. ఈవెంట్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, అదేవిధంగా ఏసీపీ స్థాయి అధికారిని ఈవెంట్ వద్ద పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపారు. మొదటిరోజు ఆరు వందల మంది, రెండోరోజు ఎనిమిది వందలు క్రమంగా 13వందల మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యేలా సమయపాలన పాటిస్తూ తమతోపాటు అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్స్ పార్ట్-II అప్లికేషన్, సంబంధిత సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను పీఎంటీ, పీఈటీ కోసం అభ్యర్థిని అనుమతించే సమయంలో ప్రతి అభ్యర్థి సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా ఎండ్ ఆర్డర్ సుభాష్చంద్రబోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏఎస్పీ అక్షాంశ్యాదవ్, ప్రసన్నకుమార్, సీపీఎస్ ఏసీపీ రవి, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అశోక్కుమార్, సత్యనారాయణరెడ్డి, యూనిట్ డాక్టర్ జితేందర్ పాల్గొన్నారు.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు..