కూసుమంచి, డిసెంబర్ 6: 2022-2023 సంవత్సరానికి గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఆధ్వర్యంలో 50 వేల మొక్కలు పెంచడమే లక్ష్యమని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. మండలంలోని కేశ్వాపురంలో మంగళవారం నర్సరీ ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చే పనులను ఆయన పరిశీలించారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే నర్సరీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి నర్సరీలో 10 వేల మొక్కలు పెంచాలనే లక్ష్యంతో పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నర్సరీ నిర్వహణ బాధ్యత పంచాయతీదేనన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామానికి కావాల్సిన మొక్కలు నర్సరీల్లో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామంచందర్రావు, అప్పారావు, ఈజీఎస్, సిబ్బంది పాల్గొన్నారు.
నేలకొండపల్లి, డిసెంబర్ 6: రహదారులకిరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. మండలంలోని అజయ్తండా పంచాయతీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి భవనాన్ని, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. సర్పంచ్ బానోత్ పార్వతి, ఈజీఎస్ ఈసీ శేషగిరి, కార్యదర్శి దుర్గ, సిబ్బంది పాల్గొన్నారు.