ఖమ్మం, డిసెంబర్ 6 : ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధి అద్భుతంగా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కితాబు ఇచ్చారు. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఖమ్మం నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
తెలంగాణలో 40శాతం ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ తరువాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రతి యేటా రూ.100 కోట్ల చొప్పున రూ.300 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ నిధులతో నిజామాబాద్ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మార్కెట్లు, జంక్షన్లు, రోడ్లు, తాగునీటి వసతి, పార్కులు తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత 50 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధి తెలంగాణలో ఈ 8 ఏండ్లలో జరిగిందన్నారు.
2015లో తాను ఖమ్మం వచ్చి 10రోజులు ఉన్నానని, ఆ రోజున ఉన్న ఖమ్మానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో హైదరాబాద్కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసిన మంత్రి అజయ్ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిజామాబాద్ వచ్చినప్పుడు మరో రూ.వంద కోట్లను నిజామాబాద్ అభివృద్ధికి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధుల వినియోగంపై ప్రగతిభవన్లో నాలుగు రోజుల క్రితం రాష్ట్రస్థాయి అధికారులు, నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారని, ఆ సందర్భంలో సీఎం కేసీఆర్ ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూసి రావాలని మమ్మల్ని ఆదేశించారన్నారు.
దాంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్, మేయర్, కమిషనర్, ఇతర ఇంజినీర్లు రెండ్రోజులపాటు ఖమ్మంలో పర్యటించామన్నారు. లకారం ట్యాంక్బండ్ అద్భుతంగా నిర్మించారని, రాత్రివేళలో సస్పెన్షన్ బ్రిడ్జి, వాకింగ్ ట్రాక్, చాలా అద్భుతంగా ఉందన్నారు. మినీ లకారం ట్యాంక్బండ్, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు, గతంలో ఉన్న ఆక్రమణలను తొలగించి పార్కులను నిర్మించడం, ఎన్ఎస్పీ వాక్ వే, శ్మశానాల నిర్మాణం, ఐటీ హబ్, కొత్త బస్టాండ్, ధ్వంసలాపురం బ్రిడ్జి, జంక్షన్ల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు తదితర అభివృద్ధి పనులను సందర్శించామని, ఇదే మోడల్గా నిజామాబాద్లో నిర్మించేందుకు అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం మాదిరి నిజామాబాద్ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం నగరంలో ఏవైపు చూసినా అభివృద్ధే కనిపిస్తున్నదని, ఖమ్మం టూర్ మాకు ఎడ్యుకేషనల్ టూర్గా ఉపయోగపడుతుందన్నారు. మంత్రి అజయ్కుమార్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాము ఖమ్మం రావడం జరిగిందని, రెండ్రోజులపాటు ఖమ్మంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సందర్శించామన్నారు. గోళ్లఫాడు చానల్ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు. నిజామాబాద్ కళాపార్కును లకారంలా అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.
ఖమ్మంలో పర్యటించిన నిజామాబాద్ బృందం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం నగరంలో జరిగిన పలు అభివృద్ధి పనులను నిజామాబాద్ ఎమ్మెల్యే బిలాల గణేశ్గుప్తా, ఆ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మేయర్ దండూ నీతూ కిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు సోమవారం, మంగళవారం సందర్శించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆయా అభివృద్ధి పనులను పరిశీలించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి వారికి ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.
సోమవారం రాత్రి లకారం ట్యాంక్ బండ్, తీగల వంతెనను సందర్శించిన వారు మంగళవారం ఉదయాన్నే మినీ లకారం ట్యాంక్బండ్ను సందర్శించి వాకర్స్ ప్యారడైజ్లో పర్యటించారు. పలువురు వాకర్లతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మినీ లకారం వద్ద ఉన్న పంచతంత్ర పార్క్లో టిఫిన్ చేసిన తరువాత గోళ్లపాడు చానల్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్క్ను సందర్శించారు. ప్రకాశ్నగర్ నుంచి సుందరయ్యనగర్ వరకు ఉన్న పార్క్లో నడిచి ఆ సౌకర్యాలను పరిశీలించారు. ఆట వస్తువులు, ఓపెన్ జిమ్లను సందర్శించారు. కాళోజీ నారాయణరావు పార్క్ను సందర్శించారు. ఎన్ఎస్పీ వాక్వే, బల్లేపల్లిలోని వైకుంఠధామాన్ని సందర్శించి, అక్కడ నుంచి పాండురంగాపురంలోని బస్తీ దవాఖానను సందర్శించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆదర్శ్ సురభి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గణేశ్గుప్తా, నిజామాబాద్ కలెక్టర్, మేయర్, కమిషనర్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.