కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 3 : ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో మరమ్మతులు పూర్తైన పాఠశాలలకు రంగులు వేయించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మన ఊరు- మన బడి’, దళితబంధు పథకాలపై విద్య, ఎస్సీ కార్పొరేషన్, ఇంజినీరింగ్ అధికారులు, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన 368 పాఠశాలల్లో 362 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 6 పాఠశాలల్లోనూ పనులు చేపట్టాలని అన్నారు. మరమ్మతులు పూర్తైన 61 పాఠశాలలు రంగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని, 15 పాఠశాలలకు రంగులు వేయడం పూర్తైనట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అంచనాలు తయారు చేసిన పనుల జాబితాను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, డీఆర్డీవో మధుసూదన్రాజు, ఉద్యాన అధికారి మరియన్న, మైనార్టీ అధికారి సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.