భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతికి నిరసనగా ఆ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఫారెస్టు రేంజ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి అర్బన్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి కలెక్టర్ అనుదీప్కు వినతిపత్రం అందజేశారు. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు కారణమైన గొత్తికోయలను అక్కడి నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్ చేశారు. ఎస్పీకి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్డీవోలు అప్పయ్య, బాబుతోపాటు రేంజ్ అధికారుల అసోసియేషన్ నాయకులు సీహెచ్ శ్రీనివాస్, రవికిరణ్, ఎ.కరుణాకర్, ముక్తార్ హుస్సేన్, చలపతిరావు, సూపరింటెండెంట్ మూర్తి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.