విధి నిర్వహణలో ఉన్న అధికారిని నరికి చంపిన గొత్తికోయలుమేకలు, ఆవులను మేపవద్దనందుకు ఘాతుకంభద్రాద్రి జిల్లా బెండాలపాడు ప్లాంటేషన్లో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ చండ్రుగొండ 22 : విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ రేంజర్ను గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ అనూహ్య ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీ ఎర్రుబోరు ప్లాంటేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బెండాలపాడు గ్రామ శివారులోని అడవిలోని ప్లాంటేషన్లో పది మందికి పైగా గొత్తికోయలు ఆవులు, మేకలు మేపుతున్నారు. ఇది గమనించిన ఫారెస్టు వాచర్ భూక్యా రాములు, సెక్షన్ ఆఫీసర్ రామారావు ప్లాంటేషన్లో ఆవులను మేపవద్దని, మొక్కలు చనిపోతాయని గొత్తికోయలకు చెప్పారు. అయినా వారు వినకుండా ఈ అడవి మాది.. మీరు ఏంచేస్తారో చేసుకోండి అని వాదనకు దిగారు. దీంతో వాచర్ రాములు చండ్రుగొండలో ఉన్న ఫారెస్టు రేంజర్ చలమల శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో ఆయన వెంటనే ప్లాంటేషన్ వద్దకు వచ్చారు.
ఈ క్రమంలో సెక్షన్ ఆఫీసర్ రామారావు పశువులను బయటకు పంపిస్తుండగా గొత్తికోయల్లో ఇద్దరు వ్యక్తులు రామారావును కొట్టారు.. పక్కనే ఉన్న రేంజర్ శ్రీనివాసరావుపై విచక్షణారహితంగా కత్తులు, గొడ్డళ్లతో మెడ, ఛాతి భాగాల్లో నరికారు. రామారావు అందించిన సమాచారం మేరకు వెంటనే హుటహుటిన ఎఫ్డీవో అప్పయ్య అక్కడకు చేరుకొని తన వాహనంలో శ్రీనివాసరావును చండ్రుగొండ ఆసుపత్రికి, అక్కడ నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చండ్రుగొండ ఆసుపత్రిలో రేంజర్ను కొత్తగూడెం డీఎస్పీ వెంటేశ్వరబాబు సందర్శించి, వెంటనే అక్కడ నుంచి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గొత్తికోయలు మొత్తంగా ఊరు ఖాళీ చేసి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొత్తికోయల గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. అనతికాలంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసరావుపై గొత్తికోయల దాడిని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఖండించారు. శ్రీనివాసరావుకు భార్య భాగ్యలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న కుమారుడు యశ్వంత్, 6వ తరగతి చదువుతున్న కుమార్తె కృతిక ఉన్నారు.
మంచిపేరు తెచ్చుకున్న శ్రీనివాసరావు
రేంజర్గా శ్రీనివాసరావు కొద్దిరోజులకే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అడవుల సంరక్షణ, గడ్డిజాతి మొక్కల పెంపంకం(అడవుల్లోని జంతువుల కోసం)పై ప్రత్యేక దృష్టి సారించినందుకు ప్రభుత్వం నుంచి గతేడాది రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్, జిల్లాలో కలెక్టర్ చేతుల మీదుగా 10వేల నగదు అందుకున్నాడు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి శిక్షణ తరగతిలో శ్రీనివాసరావుచేత పలు అంశాలపై శిక్షణ ఇప్పించేవారు. రేంజర్ శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. సెక్షన్ అధికారిగా, డీఆర్వోగా, రేంజర్గా ఉద్యోగోన్నతిపై చండ్రుగొండకు నాలుగేండ్ల క్రితం వచ్చారు. సత్తుపల్లి, ములుగు, లింగాల, ప్రాంతాల్లో పనిచేశాడు. ములుగు జిల్లాలో పని చేసినప్పుడు నక్సలైట్లతో కొంత వైరుద్యం ఉండేదనే వాదనలు ఉన్నాయి. దీంతో ఇంటిలిజెన్స్ అధికారుల సూచన మేరకు చండ్రుగొండకు ఉన్నతాధికారులు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రేంజర్ హత్య జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పథకం ప్రకారమే హత్య..?
చండ్రుగొండ రేంజర్ శ్రీనివాసరావును పథకం ప్రకారమే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటేషన్లో పశువుల మేత మేపే వ్యక్తుల దగ్గర కత్తులు, గొడ్డళ్లు ఎలా ఉంటాయి? రేంజర్ను అతి కిరాతకంగా నరికి చంపి, పక్కనే ఉన్న సెక్షన్ అధికారి, వాచర్, ఇతర సిబ్బందిని విడిచి పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరరావు సందర్శించి ఆయుధాలు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచా రం. ఘటనా స్థలాన్ని ఎస్పీ వినీత్ సందర్శించి శ్రీనివాసరావు హత్య కేసును విచారిస్తున్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 22 : గొత్తికోయల దాడిలో దారుణ హత్యకు గురైన ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు మృతితో ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరావు విధి నిర్వహణలో భాగంగా కుటుంబంతో కలిసి ఎనిమిదేళ్లుగా కొత్తగూడెంలోనే నివాసం ఉంటున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన చలమల భిక్షమయ్య-కోటమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు కాగా శ్రీనివాసరావు ఆఖరివాడు. శ్రీనివాసరావు విద్యాభ్యాసం 5వ తరగతి వరకు ఈర్లపూడి ప్రభుత్వ పాఠశాల, 7వ తరగతి వరకు మంచుకొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఖమ్మంలోని శాంతినగర్ హైస్కూల్లో, డిగ్రీ ఆర్జేసీ కళాశాలలో చదువుకున్నాడు. శ్రీనివాసరావు మృతి తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చారు. పండుగల సమయంలో గ్రామానికి వచ్చి సరదాగా గడిపేవాడని గ్రామస్తులు బాధాతప్తహృదయాలతో చెప్పారు.