భద్రాద్రి జిల్ల
తొలివిడత కంటి వెలుగు కార్యక్రమం అమలు ఇలా..పేదలు అనేక మంది కంటి సమస్యతో బాధ పడుతున్నారు. కనీసం కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయించుకోలేని పరిస్థితి. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టగా.. తొలి విడతలో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను అందజేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సలు చేశారు. ప్రజలకు కంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ‘కంటి వెలుగు’ను ప్రారంభించనున్నది. సంక్రాంతి తర్వాత రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జిల్లాలో 10 లక్షల మందికి కంటి పరీక్షలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కంటిచూపు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలం.. లేకుంటే మనిషి జీవితమే అంధకారం. ఇంతటి విలువైన కళ్లకు సమస్య వచ్చినప్పుడు వైద్య పరీక్షలు, ఆపరేషన్ చేయించుకోవడం పేదలకు పెనుభారంగా మారుతున్నది. కనీసం కళ్లద్దాలు కూడా కొనుక్కోలేని పేదలను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని 2018లో ప్రవేశపెట్టారు. దీంతో తొలి విడతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 5లక్షల మందికి పైగా ప్రజల కంటి సమస్యలకు చెక్ పడింది. సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేసింది.
శస్త్రచికిత్సలు అవసరం ఉన్నవారిని గుర్తించి వారికి వెంటనే ఆపరేషన్లు చేసి శాశ్వత పరిష్కారం చూపింది. అయితే ప్రజల కంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నది. సంక్రాంతి తర్వాత రెండో విడత ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించడంతో వైద్యశాఖ తగిన ప్రణాళికను తయారు చేస్తున్నది. ఎన్ని టీంలు చేయాలి.. ఎంతమందికి పరీక్షలు నిర్వహించాలి.. ఎంతమందికి శస్త్రచికిత్సలు చేయాలి తదితర లెక్కలు వేస్తున్నది.
10లక్షల మందికి చేకూరనున్న లబ్ధి
రెండో విడతలో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేసేందుకు వైద్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ దయానందస్వామి జిల్లా ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో వివరాలను సేకరించారు. జిల్లావ్యాప్తంగా 10లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకుంటారని లెక్కలు వేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే పంచాయతీ పరిధిలో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ ప్రైమరీ కేంద్రాల పరిధిలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 23 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 55 టీంలు కంటి వెలుగు కేంద్రాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
వృద్ధులకు చక్కటి అవకాశం
గతంలో కంటి సమస్యలకు ఎక్కువ మంది వృద్ధులు పరీక్ష చేయించుకున్నారు. ఈ సారి కూడా వారికి కంటి వెలుగు వరంలా మారనున్నది. ఎంతోమంది వృద్ధులు చూపు సమస్యతో బాధపడుతున్నారు. తొలివిడతో కళ్లద్దాలతోపాటు ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు. మరోసారి కంటి వెలుగు ఏర్పాటు చేయనుండటంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తొలివిడతలో 4,91,344 మందికి కంటి పరీక్షలు
తొలి విడత కంటి వెలుగులో జిల్లావ్యాప్తంగా 4,91,344 మందికి పరీక్షలు చేసి 1,70,898 మందికి కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన 684 మందికి శస్త్రచికిత్సలు చేశారు. జిల్లావ్యాప్తంగా 2,967 గ్రామాల్లో 333 క్యాంపులను నిర్వహించారు. విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు నిర్వహించి రీడింగ్ కళ్లద్దాలను అందజేశారు.
మాలాంటోళ్లకు చాలా ఉపయోగం
అప్పుడు కంటివెలుగు పెట్టినప్పుడు అద్దాలిచ్చారు. బాగా పనిచేశాయి. కళ్లద్దాలు కొనుక్కోవాలంటే చాలా డబ్బులవుతున్నాయి. ప్రభుత్వమే అందజేస్తుండటంతో చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఏదిచేసినా జనానికి ఉపయోగపడేలా చేస్తారు. ముసలోళ్లు ఆపరేషన్లు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కంటి వెలుగు మంచి కార్యక్రమం. అప్పుడు ఇచ్చిన కళ్లద్దాలు ప్రతి ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి.
– జోయినబోయిన వెంకటేశ్వర్లు, డేగలమడుగు
రెండో విడతపై కసరత్తు ప్రారంభం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు కంటి వెలుగు రెండో విడతపై కసరత్తు ప్రారంభించాం. ఇప్పటికే జిల్లా ప్రోగ్రాం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాం. 55 టీంలను తయారు చేస్తున్నాం. ప్రతి పీహెచ్సీ పరిధిలో కంటి వెలుగు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా ప్రోగ్రాం అధికారిని కూడా నియమిస్తాం.
– డాక్టర్ దయానందస్వామి, డీఎంహెచ్వో
జిల్లా ప్రజలకు వరం..
తొలివిడతలో జిల్లాలో ప్రతి కుటుంబానికి కంటి అద్దాలు అందాయి. సమస్య ఉన్నవారికి కంటి చూపు పరిష్కారమైంది. కంటి ఆపరేషన్లు కూడా చేశారు. రెండో విడత కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రజలకు వరం. వృద్ధులకు చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి.
– కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్