గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనున్నది. గతంలో కంకర తేలి, గుంతలుపడిన రహదారులు ఇక రాచబాటలు కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పల్లెలకు సరైన రహదారులు లేక అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో బురదమయమైన రహదారులపై వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. వరదలతో వాగులు ఉప్పొంగి ప్రవహించినప్పుడు వాగు అవతలి గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. కానీ, స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది.
మారుమూల పల్లెలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం రహదారి సౌకర్యం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని 17 గ్రామాల్లో 23 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి మోక్షం కలిగింది. గిరిజన సంక్షేమశాఖ నుంచి రూ.17.56 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ రహదారుల నిర్మాణాలు పూర్తయితే సుమారు 40 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కలుగనున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటే
ఉంటామని ముక్త కంఠంతో పేర్కొంటున్నారు.
– టేకులపల్లి, నవంబర్ 21
ఎమ్మెల్యే హరిప్రియ కృషితో రూ.17.56 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం
టేకులపల్లి, నవంబర్ 21 : ఇల్లెందు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గిరిజన గ్రామీణ ప్రాంతాలకు సరైన రహదారులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు పండించిన పంటలు సైతం ఇంటికి చేర్చేందుకు నానాయాతన పడుతున్నారు.
రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించిన ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గ పరిధిలోని 17గ్రామాల్లో 23 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి మోక్షం కలిగించింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రూ.17.56 కోట్లను మంజూరు చేయించారు. ఈ రహదారుల నిర్మాణాలు పూర్తయితే సుమారు 40 గ్రామాల ప్రజలకు రోడ్డు రవాణా సౌకర్యం కలుగనున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మండలానికి రూ.13.48 కోట్లు
టేకులపల్లి మండలంలోని గ్రామాలకు మొత్తం 11 రహదారుల నిర్మాణానికి రూ.13.48 కోట్లు మంజూరయ్యాయి. వాటి వివరాలిలా ఉన్నాయి.. కోయగూడెం జడ్పీ రోడ్డు నుంచి హన్మతండా వరకు 1.10 కిలోమీటర్లకు కోటి ఇరువై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం, చింతోనిచెలక నుంచి పెద్దతండా వరకు కిలోమీటరు దూరానికి రూ.కోటి, ఆర్అండ్బీ రోడ్డు నుంచి సాయన్నపేట వరకు 0.70 కిలోమీటర్లకు 70 లక్షలు, చింతోని చెలకనుంచి మద్రాస్తండా 1.60 కిలోమీటర్లకు 3.20కోట్లు, శంభునిగూడెం పంచాయతీ రాజుతండా రోడ్డుకు 1.60 కిలోమీటర్లకు కోటి అరవై లక్షలు, బోడు రోడ్డు నుంచి తుమ్మలచెలక వరకు 1.70 కిలోమీటర్ల రోడ్డుకు కోటీ 70లక్షలు, బద్దుతండా నుంచి అబ్బిరెడ్డిగూడెం వరకు 2.30 కిలోమీటర్లకు కోటి 35లక్షలు, గంగారం నుంచి పెద్ద చెర్లపల్లి గ్రామానికి 1.20 కిలోమీటర్లకు 18లక్షలు, కొమ్ముగూడెం నుంచి ఇప్పలచెలక 1.60 కిలోమీటర్లకు 93లక్షలు, గంగారం నుంచి ఉల్వచెలకకు 2కిలోమీటర్లకు 30 లక్షలు, సాయన్నపేట రోడ్డుకు 0.60 కిలోమీటర్లకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి త్వరలో రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
దశాబ్దాల కల సాకారం…
మారుమూల ప్రాంతమైన గంగారం పంచాయతీ పరిధిలోని ఉల్వచెలక, పెద్ద చర్లపల్లి, గిరిజన బాలాజీ వెంకటేశ్వర టెంపుల్ రహదారి సరిగా లేక ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. బీటీ రోడ్డు కోసం రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ సహకారంతో ఈ మూడు ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కలగడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేకు, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఇస్లావత్ బాలూనాయక్, గంగారవాసి
ఎమ్మెల్యే హరిప్రియకు రుణపడి ఉంటాం..
చింతలంక గ్రామ ప్రజలు ఎటుపోవాలన్న మూడు వాగులు దాటాలి. బ్రిడ్జీలు లేకపోవడంతో వానకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది నాయకులు వచ్చారు.. పోయారు.. కానీ ఎమ్మెల్యే హరిప్రియ మూడు బ్రిడ్జిల నిర్మాణానికి హామీ ఇచ్చి సుమారు రూ.3.50 కోట్లు మంజూరు చేయించారు. ఎమ్మెల్యే హరిప్రియానాయక్కు
ప్రత్యేక కృతజ్ఞతలు.
– భూక్యా రతన్లాల్, సర్పంచ్, చింతలంక