ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 20: గీత కార్మికులు దశాబ్దాలుగా సర్కారుకు రకం (గీత పన్ను)ను రద్దు చేసి వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని పొదిలవారి మామిడితోటలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గౌడ సమారాధనలో ఆయన మాట్లాడారు. గౌడ కులస్తులంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గీత కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం తాటి, ఈత చెట్లకు పన్ను రద్దు చేసిందన్నారు.
హైదరాబాద్లో తిరిగి కల్లు కాంపౌండ్లను తెరిపించిందన్నారు. వైన్స్ షాపుల కేటాయింపులో గౌడలకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. గీత కార్మికుల ప్రమాద బీమాను రూ.6 లక్షలకు పెంచిందన్నారు. మరికొన్ని రోజుల్లో గీత కార్మికులకు ద్విచక్రవాహనాలు అందజేయనున్నదన్నారు. అనంతరం మంత్రి గౌడ సంఘం నాయకులతో కలిసి నీరా తాగారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు అమరగాని వెంకటేశ్వర్లు గౌడ్, గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు మరికంటి ధనలక్ష్మి, బోడపట్ల వెంకన్న, గుడిద శ్రీనివాస్, తిరుమలరావు, ప్రతాపనేని రామకష్ణ గౌడ్, వత్సవాయి రవి, చిత్తలూరి నర్సయ్య, ఊడుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.