ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రజా రవాణా ‘సారథులు’.. ‘ప్రగతి రథ’ చక్రాలు నడిపేశ్రామికులు.. అన్ని వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్న పని.. గంటలు గంటలు సీట్లో కూర్చోవాలి.. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బస్సు నడపాలి.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలి.. అలాగే కండక్టర్లదీ డ్రైవర్లతో సమానమైన శ్రమ .. ఎండావాన చలి తాకిడిని తట్టుకుంటూ గంటల కొద్దీ పనిచేస్తారు.. సమయం దొరికినప్పుడు తింటారు.. విశ్రాంతి తీసుకుంటారు.. వీరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ రిస్క్ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికుడికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మకంగా ‘గ్రాండ్ హెల్త్’ డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఇప్పటికే భద్రాచలం, ఖమ్మం డిపోల్లో వైద్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలో మణుగూరు, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి డిపోల్లో ప్రారంభంకానున్నాయి. వ్యాధులు నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్పత్రిలో సర్కార్ఉచితంగా చికిత్స అందించనున్నది.
– సత్తుపల్లి, నవంబర్ 20
సత్తుపల్లి, నవంబర్ 20: నిత్యం వందలాది కిలోమీటర్ల ప్రయాణం. చలి, ఎండ, వాన తాకిడిని తట్టుకుంటూ గంటల కొద్దీ విధుల నిర్వహణ. అసాధారణ పని గంటలు. భరించలేని బడలిక. కుదిరినప్పుడు తిండి. లేకపోతే లేదు. పాపం డ్రైవర్లు, కండక్టర్ల కష్టం ఎంతో కదా.. డ్రైవరన్న గంటలు గంటలు సీట్లోనే కూర్చుంటాడు. స్టీరింగ్ తిప్పడం కాస్త అటూ ఇటూ అయితే చాలు. ఎంతటి ప్రమాదం సంభవిస్తుందో ఊహించవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా బాధలు ఎన్ని ఉన్నా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇక కండక్టర్ల సంగతి చెప్పనక్కర్లేదు. బస్సు ఎక్కే వారు, దిగే వారిని చూసుకోవాలి.
రకరకాల మనుషులు తగులుతుంటారు. అరవాలి. కిక్కిరిసిన బస్సులో అటూ ఇటూ తిరగాలి. మొత్తానికి కదిలే బస్సును తన ఇల్లుగా చూసుకోవాలి. వారి త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. డిపోల్లో మెకానిక్లు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది.. ఇలా ఎంతోమంది సంస్థకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. వారు అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టే ‘తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ)’ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది సంస్థ. అలాంటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సంస్థ మరో పదికాలాల పాటు చల్లగా ఉన్నట్లే. ఈ కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్’ డ్రైవ్ పేరుతో వైద్యశిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఆరు డిపోల పరిధిలో..
ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో వైద్యశిబిరాలు జరుగనున్నాయి. ఇప్పటికే ఖమ్మం, భద్రాచలం డిపోల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయి. వైద్యనిపుణులు, సిబ్బంది ఒక్కో కార్మికుడికి 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం డిపోలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఇద్దరు కార్మికులకు గుండె జబ్బు ఉన్నట్లు తేలింది. వైద్యులు వెంటనే వారిని హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. సిబ్బంది సంఖ్య ఆధారంగా, షెడ్యూల్స్ వారీగా మిగతా డిపోల పరిధిలోనూ వైద్యశిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఆరు డిపోల పరిధిలో మొత్తం 2,759 మంది సిబ్బంది ఉండగా వీరిలో 2,255 మంది ఉద్యోగులు, అద్దె బస్సు డ్రైవర్లు 504 మంది ఉన్నారు. వీరికి వచ్చే నెల 3 వరకు డ్రైవ్ కొనసాగుతున్నది.
వైద్యపరీక్షలు ఇలా..
వైద్యనిపుణులు బీపీ, ఈసీజీ, డయాబెటిక్ వంటి 13 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల ద్వారా ఉద్యోగులు, సిబ్బంది మున్ముందు ఎదుర్కొనే ఆరోగ్యపరమైన సమస్యలను పసిగట్టే అవకాశం ఉంటుంది. వైద్యపరంగా ముందే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కార్మికుల హెల్త్ప్రొఫైల్ నిక్షిప్తమై ఉంటుంది. హెల్త్ప్రొఫైల్ను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.
డిసెంబర్ 3 వరకు డ్రైవ్..
‘టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్’లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 13 నుంచి డిసెంబర్ 3 వరకు డ్రైవ్ కొనసాగుతుంది. ఆయా డిపోల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.ప్రభులత, రీజనల్ మేనేజర్, ఖమ్మం
ఆర్టీసీ ఉద్యోగులకు మేలు..
నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అండగా నిలుస్తున్నారు. కార్మికులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించడం హర్షణీయం. గతంలో ఉద్యోగులు వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు డిపోల వద్దకే వైద్యులు వచ్చి వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఉద్యోగులకు వ్యయప్రయాసలు తప్పాయి.
– కిన్నెర ఆనందరావు, ఆర్టీసీ కండక్టర్, సత్తుపల్లి