ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలి తీవ్రరూపం దాల్చుతున్నది. భద్రాద్రి జిల్లాలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత15 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 16 డిగ్రీలకు చేరింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడురోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. కాగా, చలి కాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– ఖమ్మం వ్యవసాయంనవంబర్ 17
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి పంజా గజ గజ వణికిస్తున్నది. వారం రోజుల క్రితం 24 డిగ్రీలు ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రత గురువారం రాత్రికి 16 డిగ్రీలకు చేరుకున్నది. ఉదయం 9 గంటలైనా మంచు తెరపివ్వడం లేదు. భద్రాద్రి ఏజెన్సీలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. దీంతో చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం చల్లటి గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వాహన డ్రైవర్లకు ఇబ్బందులు..
జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తున్నది. దీంతో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు తెరలు కమ్ముకోవడంతో కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగాయి. కొందరు డ్రైవర్లు సబ్ వేల్లో వాహనాలు నిలిపి సేద తీరుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరికొందరు తెల్లవారినా వాహన లైట్లు వేసి ప్రయాణం సాగిస్తున్నారు.
రానున్న మూడు రోజులు కీలకం..
రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రమాదమూ ఉండొచ్చని అంచనా వేసింది. కొన్ని జిల్లాలను ఇప్పటికే ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్నిదుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నది. సాధారణంగా కార్తీక మాసంలో చలి ఎక్కువగానే ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈఏడాది చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది.
జాగ్రత్తలు తప్పనిసరి..
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చంటిబిడ్డలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలంటున్నారు. వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్లు ధరించాలని సూచిస్తున్నారు. వేడి వేడి ఆహార పదార్థాలే తీసుకోవాలంటున్నారు.