తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతోపాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టింది. వారు వైద్యపరీక్షలు, ప్రసవానికి వెళ్లేందుకు రవాణా భారం కాకూడదనే ఉద్దేశంతో 102 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సంజీవనిలా పనిచేస్తున్నాయి.
ఆపదలో బంధువై సేవలు అందిస్తున్నాయి. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు 102 వాహనాల ద్వారా సర్కారు దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు, ప్రసవం అనంతరం తిరిగి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 30 వాహనాలు ఉండగా.. ఇప్పటి వరకు ఈ వాహనాలు 1,84,572 ట్రిప్పులు తిరిగాయి. 4,85,386 మందికి సేవలు అందించాయి.
-సత్తుపల్లి, నవంబర్ 17
గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి సేవలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 అమ్మఒడి వాహనాలు నెలలో కనీసం మూడు పర్యాయాలు గ్రామాలకు వెళ్తున్నాయి. ఎప్పుడెప్పుడు వచ్చేది ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఆయా రోజుల్లో గర్భిణులు, బాలింతలను దవాఖానలకు తరలిస్తున్నాయి. ప్రధానంగా గర్భిణులు 3వ నెల నుంచి 9వ నెలవరకు ప్రతినెలా ఏఎన్సీ చెకప్ల కోసం అమ్మ ఒడి వాహనాల్లోనే వారిని ఆశావర్కర్లు సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. చెకప్ల అనంతరం తిరిగి తమ స్వగ్రామాల్లో ఇంటి వద్ద దించుతున్నారు.
సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగిన తర్వాత బాలింతలను ఈ వాహనాల్లోనే తమ ఇంటి వద్దకు పంపుతున్నారు. సిజేరియన్ ప్రసవాలు జరిగితే ఇతర వైద్యసేవల కోసం ఆసుపత్రులకు ఈ వాహనాలను ఉపయోగించుకునేలా ప్రభుత్వం వీలు కల్పించింది. శిశువులకు వ్యాక్సినేషన్ కోసం తల్లీబిడ్డలను ఈ వాహనాల్లోనే సర్కారు దవాఖానలకు తరలిస్తున్నారు.
సత్తుపల్లి, నవంబర్ 17 : గర్భిణులు, బాలింతలకు ‘అమ్మఒడి’ పథకం కొండంత అండగా నిలుస్తున్నది. వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 102 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైనవారు 102కు కాల్చేస్తే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తున్నాయి. వైద్యపరీక్షలు, ప్రసవ అనంతరం మళ్లీ ఇంటి వద్దే డ్రాప్ చేస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం గర్భిణిలు, బాలింతలకు 102 వాహనాలు సేవలందిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 26న (అమ్మ ఒడి) 102 వాహనాలను ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 30 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు 30 వాహనాల ద్వారా 1,84,572 ట్రిప్పుల ద్వారా 4,85,386 మందికి ప్రయోజనం చేకూరింది. అమ్మఒడి సేవలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాలతో గర్భిణులు, బాలింతలకు వ్యయ ప్రయాసలు తప్పడంతోపాటు వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు రవాణా సదుపాయం కల్పిస్తూ వారిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి పరీక్షల అనంతరం తిరిగి ఇంటి వద్ద వదిలి వెళ్తున్నాయి.
1,84,572 ట్రిప్పులు.. 4,85,386 మందికి లబ్ధి..
భద్రాద్రి జిల్లాలో జనవరి 18 నుంచి మార్చి 18 వరకు 1,181 ట్రిప్పుల ద్వారా 2,402, ఏప్రిల్ 18 నుంచి మార్చి 19 వరకు 16,344 ట్రిప్పుల ద్వారా 31,676, ఏప్రిల్ 19 నుంచి మార్చి 20 వరకు 31,236 ట్రిప్పుల ద్వారా 69,367, ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 వరకు 21,142 ట్రిప్పుల ద్వారా 60,047, ఏప్రిల్ 21 నుంచి మార్చి 22 వరకు 24,119 ట్రిప్పుల ద్వారా 68,493, ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 22వ వరకు 15,941 ట్రిప్పుల ద్వారా 50,337 మంది 102 వాహనాల సేవలు వినియోగించుకున్నారు.
జనవరి 18 నుంచి మార్చి 18 వరకు 973 ట్రిప్పుల ద్వారా 1,609, ఏప్రిల్ 18 నుంచి మార్చి 19 వరకు 10,668 ట్రిప్పుల ద్వారా 19,304, ఏప్రిల్ 19 నుంచి మార్చి 20 వరకు 20,778 ట్రిప్పుల ద్వారా 53,036, ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 వరకు 16,049 ట్రిప్పుల ద్వారా 42,671, ఏప్రిల్ 21 నుంచి మార్చి 22 వరకు 15,681 ట్రిప్పుల ద్వారా 49,813, ఏప్రిల్ 22 నుంచి అక్టోబర్ 22వ వరకు 9,460 ట్రిప్పుల ద్వారా 36,631 మంది 102 వాహనాల సేవలు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 184,572 ట్రిప్పుల ద్వారా 4,85,386 మంది గర్భిణులు, బాలింతలు అమ్మొఒడి పథకంలో లబ్ధిపొందారు.
రవాణాలో వ్యయప్రయాసలు తప్పాయి
ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతినెలా చెకప్ల కోసం వెళ్లడానికి ఇబ్బందులు తప్పాయి. 102 వాహనంలో ఆశాకార్యకర్తలు దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఇంటి వద్ద సురక్షితంగా దింపుతున్నారు. ఆటోలు, బస్సుల్లో వెళ్లే పనిలేకపోవడంతో వ్యయ, ప్రయాసలు తప్పాయి.
-బండి స్వాతి, గర్భిణి, తాళ్లపెంట, పెనుబల్లి మండలం
క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు..
102 వాహనాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తున్నాం. చెకప్లు, ప్రసవాల కోసం 102కు డయల్ చేస్తే వాహనాలు అక్కడి వెళ్తున్నాయి. దవాఖానలకు తరలించి పరీక్షలు చేయించి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయి. ప్రసవాలు, చిన్నారులకు వ్యాక్సినేషన్ తదితర సమయాల్లోనూ వాహనాలను వినియోగించుకుంటున్నారు.
-భూమా నాగేందర్, అమ్మఒడి ప్రోగ్రామ్ ఇన్చార్జి, ఉమ్మడి ఖమ్మం జిల్లా
గర్భిణులు, బాలింతలకు మేలు
గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలను వినియోగించుకుని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీ కేంద్రాలకు వెళ్లి ఆరోగ్య సేవలు పొందిన అనంతరం తిరిగి ఆ వాహనాల్లో క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి.
-కె.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపతి సూపరింటెండెంట్, సత్తుపల్లి