పినపాక , అక్టోబర్ 26 : ఉద్యాన వన పంటల్లో బంతి సాగు రైతన్నలకు లాభాలు కురిపిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల పంటతో తక్కువ పెట్టుబడితో అన్నదాత అధిక ఆదాయం సంపాదిస్తుండడంతో మండలంలో పలువురు రైతులు బంతి సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. పండుగల సీజన్లో బంతిపూలకు మంచి డిమాండ్ ఉండడంతో ఉద్యాన అధికారులు రైతులను సాగు విస్తీర్ణం పెంచేందుకు పోత్సహిస్తున్నారు. పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
బంతి సాగు చేసే రైతులు జూలై మొదటి వారంలో మొక్కలను నాటితే సెప్టెంబర్ నుంచి పంట చేతికందుతుంది. ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నులు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పూలు తెంపితే దిగుబడి వస్తుందని అన్నారు. మండలంలో తోగ్గూడెం, గోపాలరావుపేట, ఏడూళ్ళబయ్యారం, జానంపేట గ్రామాలల్లో పలువురు రైతులు బంతిసాగు చేస్తూ సీజన్లో మంచి లాభాలు పొందుతున్నారు.
కార్తీక మాసంలో పండుగలతో పాటూ వివిధ శుభకార్యాలయాలకు బంతి పూలకు మంచి గిరాకీ ఉంటుంది. దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, అయ్యప్ప దీక్షలు, మహాశివరాత్రి సందర్భంగా బంతిపూల గిరాకీ లభిస్తుంది. మార్కెట్లో కిలో బంతిపూలు రూ. 100 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు.
గత కొన్నేళ్లుగా వరి, పత్తి, మిర్చి తదితర సాంప్రదాయ పంటలు సాగుచేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతులు అప్పుల పాలవ్వకుండా ఉండాలంటే పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. ఇందుకు వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించే పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో రైతులు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న బంతిపూలను సాగు చేసి లాభాలను గడిస్తారు. బంతిపూల సాగుకు ఎకరానికి రూ. 30వేల పెట్టుబడి అవుతుందని, పెట్టుబడి పోనూ ఎకరానికి రూ 50వేల వరకు మిగులుతుందని బంతిసాగు రైతులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ సూచన మేరకు వరి పత్తి కాకుండా ప్రత్యామ్నాయంగా మూడేళ్ల నుంచి బంతిపూల సాగుచేస్తున్నాను. ఏటా ఒక ఎకరంలో బంతి మరో అరెకరం మల్లెపూల సాగు చేస్తున్నా. వరి పంటతో పోలిస్తే పూల సాగులో నికర ఆదాయం కన్పిస్తుంది. అంతేగాక కూలీలు అతి తక్కువ. మేము కుటుంబ సభ్యులమే బంతిపూల సాగు చేసుకుంటున్నాం. పంటల మార్పిడితో లాభాలు పొందుతున్న. అధికారులు ప్రోత్సహించడంతో పాటూ పంట సాగులో సూచనలిస్తున్నారు.
– అంకతి సిద్దయ్య, రైతు గోపాలరావుపేట
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలి. ప్రభుత్వం సూచించిన విధంగా అధికారుల సలహాలతో ప్రణాళిక బద్దంగా సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. పంటల మార్పిడితో ఎక్కువ లాభాలుంటాయి. పప్పుదినుసులు, కూరగాయలు, పూల సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. బంతిపూలు సాగు చేసిన రైతులు లాభాలు పొందడం హర్షనీయం. బంతి రైతులను మిగతా రైతులు ఆదర్శంగా తీసుకోవాలి.- మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు