అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ 26: స్థానిక శ్రీ భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవం బుధవారం ప్రారంభమైంది. విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, నీరాజనం, మంత్ర పుష్పం, ఆకాశ దీపారాధణ తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. భక్తులు ఆలయంలో జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయంలో 29న నాగుల చవితి, నవంబర్ 7న కార్తీక పౌర్ణమి, కృత్తిక దీపోత్సవం, జ్వాలా తోరణం, కోనేటి హారతి, 18న అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, 22న శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఉంటాయి.
అశ్వారావుపేట టౌన్, అక్టోబర్ 26: కార్తీక మాసం మొదటి రోజు బుధవారం పట్టణంలోని కోనేరు పురాతన శివాలయం, వాసవీ అమ్మవారి ఆలయం, షిరిడీ సాయిబాబా ఆలయంతోపాటు వెంకమ్మ చెరువు కట్టపై కొలువైన భక్తాంజనేయ స్వామికి భక్తులు పూజలు చేశారు. కోనేరు శివాలయంలో శివలింగార్చన, అభిషేకాలు నిర్వహించారు. వాసవీ అమ్మవారి ఆలయంలో అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్న ప్రసాదం స్వీకరించారు.
చండ్రుగొండ, అక్టోబర్ 26: మండలంలోని అన్ని ఆలయాల్లో భక్తులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా శివాలయం, త్రిమూర్తుల ఆలయంలో భక్తుల రాకతో సందడి నెలకొంది. వేద పండితులు వీవీఆర్కే మూర్తి ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు చేశారు.