ఖమ్మం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, అందుకే తెలంగాణపై ప్రధాని మోదీ తన స్థాయిని తగ్గించుకొని విషం కక్కుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ.. తక్షణమే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని, పెప్పర్ స్ప్రేలు చల్లి, మైకులను ఆపేసి, చర్చ లేకుండానే రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించారంటూ ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ విషం కక్కారని ఆరోపిస్తూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రసంగించారు. తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ నోరు పారేసుకోవడం ఇది మొదటిసారి కాదని, అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. మోదీ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఉద్యమ నేత కేసీఆర్ కఠోర దీక్ష, 1200 మంది ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఆవిర్భవించిందని, ఎవరి దయాదాక్షిణ్యాల వల్లా కాదని గుర్తుచేశారు. ప్రధాని వ్యాఖ్యలతో తెలంగాణ అమరుల ఆత్మలు ఘోశిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. దీంతో ఇప్పుడు దేశంలోని పలు రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఇక్కడి పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రధాని మోదీ అమానుషంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం తప్ప.. తెలంగాణ రాష్ర్టానికి మోదీ పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం వైఫల్యాలను తెలంగాణ ఎత్తి చూపుతుందన్న కారణంతో ప్రధాని మోదీ.. ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణను కించపరుస్తున్నారని అన్నారు. ‘మీ గుజరాత్ కంటే తెలంగాణే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని కడుపు మంటా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని కళ్ల మంటా?’ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంపై మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసినందున తెలంగాణ బీజేపీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగా దీర్ఘకాలిక పోరాటాలతో సిద్ధించిన తెలంగాణపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా ఎదుగుతుండడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తెలంగాణపై పదే పదే విషం కక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రజలు వీధుల్లో తిరగనివ్వరని స్పష్టం చేశారు. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడడం ఆయనకు కంటగింపుగా ఉందన్నారు.
టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి నగరంలోని పలు వీధుల మీదుగా మంత్రి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ సెంటర్లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర, అంత్యక్రియలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేఎంసీ మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, నాయకులు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, చింతనిప్పు కృష్ణచైతన్య, తన్నీరు శోభారాణి పాల్గొన్నారు.