భద్రాచలం, ఫిబ్రవరి 3: ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు ఊపందుకుంటున్నది. ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించి మాట్లాడారు. భద్రాచలం ప్రాంత ప్రజలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. దీక్ష శిబిరాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఎం, టీడీపీ, సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు తిరిగివ్వాలన్న డిమాండ్తో అక్కడి ప్రజలు గురువారం సరిహద్దు తూరుబాక బ్రిడ్జిపై గురువారం రాస్తోరోకో నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ పంచాయతీలను పాడేరులో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ‘మాకు పాడేరు వద్దు.. తెలంగాణ ముద్దు’ అని డిమాండ్ చేస్తూ ఈ ఐదు గ్రామాల ప్రజలు రాస్తారోకోకు దిగారు.
నిరంతరం రామ జపం చేసే బీజేపీకి భద్రాచలం రాముడిపై వివక్ష ఎందుకని సీపీఎం నేత ఏజే రమేష్ ప్రశ్నించారు. భద్రాచలంలో గురువారం జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముంపు పేరుతో ఐదు మండలాలను ఏపీకి ఇచ్చిన కేంద్రం.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణకు తిరిగి తీసుకురాలేదా?’ అని ప్రశ్నించారు.