ఖమ్మం లీగల్, ఫిబ్రవరి 11: మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులను పెద్దమనసుతో క్షమించి రాజీమార్గంలో పయనించాలని సూచించారు. సమాజ సుఖశాంతులకు రాజీమార్గమే ఉత్తమమని అన్నారు. కలహిస్తున్న కక్షిదారుల ముఖాలపై చిరునవ్వు చూడడమే లోక్ అదాలత్ ధ్యేయమని స్పష్టం చేశారు. కలహాలు లేని సమాజమే అభివృద్ధి చెందుతుందని అన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జావేద్ పాషా మాట్లాడుతూ నిరుడు జాతీయ లోక్ అదాలత్లో 62,587 కేసులు పరిష్కారమవ్వగా అందులో 574 సివిల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ.. బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు కక్షిదారుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.
వివిధ కేసుల పరిష్కారం..
రాజీమార్గం ద్వారానే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో పలు కేసులు పరిష్కారమయ్యాయి. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గంగుల త్రినాథ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన తల్లిదండ్రులు, భార్య కలిసి ఖమ్మం కోర్టులో బీమా కంపెనీపై రూ.కోటికి కేసు దాఖలు చేశారు. జాతీయ లోక్ అదాలత్లో ఈ కేసు రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారు. ఇరుపక్షాల వారిని పిలిపించి బీమా కంపెని వారితో రాజీమార్గం కల్పించి కక్షిదారులకు రూ.కోటి పరిహారాన్ని రాజీమార్గం ద్వారా అవార్డు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం లోక్ అదాలత్లో లభించడం తెలంగాణలోనే ఇది ప్రథమమని బీమా కంపెనీ న్యాయవాది తెలిపారు.
8046 కేసుల పరిష్కారం..
శనివారం నాటి అదాలత్లో 8046 కేసులు పరిష్కారమయ్యాయి. ఖమ్మం కోర్టులో వివిధ కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు చేసి బెంచ్లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఖమ్మంలో 6094 కేసులు, మధిరలో 1251 కేసులు, సత్తుపల్లిలో 701 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. పలు బెంచ్లకు అదాలత్ సభ్యులుగా పలువురు న్యాయవాదులు వ్యవహరించారు.