ఖమ్మం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరికి ఆ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ బుధవారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం మూడు రాజ్యసభ సభ్యుల పదవులు ఖాళీ అవుతుండగా వాటిలో రెండు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్ఎస్కు దక్కనున్నది. నామినేషన్ల దాఖలుకు గురువారం వరకే ఆఖరు గడువు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తమ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో నేడు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రేణుకా చౌదరి 1999 లోక్సభా ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసి గెలిచారు. తర్వాత 2004 లోక్సభ ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆమె కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సీపీఐ ఉన్నది. దీంతో సీపీఐ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలకు రేణుకా చౌదరి దూరంగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీచేసినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా రేణుకాచౌదరికి పేరున్నది. ఆమె ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ అది జరగలేదు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉన్నప్పటికీ, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయమై రేణుకా చౌదరినే ఓ సందర్భంలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే తనదే సీటు అని మీడియా సమక్షంలో ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రస్తుతం ఆమెకు రాజ్యసభ అభ్యర్థిగా మరో అవకాశం కల్పిస్తున్నది. ఆమెకు ప్రాధాన్యమివ్వడాన్ని జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులూ స్వాగతిస్తున్నాయి.