ఖమ్మం సిటీ, జనవరి 7: ‘ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతం. ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు అమూల్యం. దవాఖానలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటివన్నీ అత్యద్భుతం’ అంటూ నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బృందం ప్రశంసల వర్షం కురిపించింది. ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాయకల్ప అవార్డుల పోటీకి అర్హత పొందే నిమిత్తం, తనిఖీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చెందిన బృందాన్ని ఖమ్మానికి పంపించింది.
శనివారం ఆ బృంద సభ్యులు పెద్దాసుపత్రికి వచ్చి జనరల్ వార్డులు, ఐసీయూ, ల్యాబ్స్, ఫార్మసీ, స్కానింగ్, ఎక్స్రే సహా అన్ని విభాగాలనూ క్షుణ్నంగా తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటిస్తూ రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. అడుగడుగునా పారిశుధ్యం అంశాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఆ తరువాత మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సాధారణ, సెక్షన్ ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల వద్దకు వెళ్లి వైద్యులు, సిబ్బంది సహకరిస్తున్న తీరు గురించి వాకబు చేశారు. లేబర్ రూం నిర్వహణను తనిఖీ చేశారు.
అనంతరం దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రికార్డులను పరిశీలించి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రతిష్ఠాత్మక కాయకల్ప అవార్డుకు అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నదని అన్నారు.
స్థానికంగా వైద్యులు, సిబ్బంది పనితీరు సైతం బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, నిర్మల్ ప్రతినిధుల బృంద సభ్యులు డాక్టర్ రాథోడ్ కపిల్నాయక్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్.కృష్ణవేణి, రిజ్వాన్, కే.సంపత్కుమార్, పెద్దాసుపత్రి ఎంసీహెచ్ హెచ్వోడీ కృపా ఉషశ్రీ, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, క్వాలిటీ మేనేజర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.