అనుబంధాల వేదిక.. ఆత్మీయతకు ప్రతీక.. రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. రాఖీ పండుగను అన్నాచెల్లెళ్లు , అక్కా తమ్ముళ్ల ప్రేమాను రాగాలతో జరుపుకుంటారు. సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకున్నారు. ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా రాఖీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రాఖీ, స్వీట్ షాపుల్లో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. మహిళా సంఘాల సభ్యులు, మహిళలు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతిని ధులకు రాఖీ కట్టి ఆప్యాయతను చాటారు. పాఠశాలలు, కళాశాలల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాఖీ సంబురాలు అంబరాన్నంటాయి.
-నమస్తే నెట్వర్క్, ఆగస్టు12
అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం.. జన్మ జన్మలకు విడిపోని బంధం.. వీరి అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్’. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. సోదరీమణులు తమ సోదరులను ఆప్యాయంగా పలకరిస్తూ.. మిఠాయి తినిపించి రాఖీ కట్టారు..
రాఖీ పూర్ణిమ సందర్భంగా రాఖీ దుకాణాలు, మిఠాయి షాపుల వద్ద సందడి కనిపించింది. మార్కెట్లో వందలాది రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
-నెట్వర్క్