మధిరటౌన్/కూసుమంచి/బోనకల్లు/చింతకాని/ముదిగొండ/నేలకొండపల్లి/మధిరటౌన్/కూసుమంచి రూరల్/ఎర్రుపాలెం ఆగస్టు 11: అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు సోదరభావానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మధిరలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు రాఖీలు కట్టారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజుకు కౌన్సిలర్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధిర భరత్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి రాఖీ కట్టించుకొని రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, వార్డుకౌన్సిలర్లు బిక్కి అనిత, మాధవి, మేడికొండ కళ్యాణి, మాధురి, యర్రగుంట లక్ష్మీ, మాజీ జడ్పీటీసీ ప్రియాంక, ప్రశాంతి, సుజాత, చావా వేణు, ఫీల్డ్అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. అక్కాచెల్లెళ్లు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. బోనకల్లులో మానసిక వికలాంగుల కేంద్రంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. చింతకాని మండల పరిధిలో మహిళలు, చిన్నారులు తమ తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
కూసుమంచిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో సోదరులు పాఠశాలకే వచ్చి రాఖీలు కట్టించుకొని స్వీట్లు పంచుకొని వెళ్లారు. బానోత్ ఫూల్సింగ్ గంగబండతండా పొలంలో నాటు పెడుతున్నాడు. సోదరి వడ్త్యి లలిత పక్కనే హాముతండా పొలం నాటు వేయడానికి కూలీగా వచ్చింది. రాఖీ కావడంతో పొలం నాటు పెట్టేందుకు వచ్చిన చెల్లి అన్న ఒకే దగ్గర కలుసుకున్నారు. అప్పటిదాకా నాటు వేసిన చెల్లి అన్నకు పొలం గట్టుపైనే రాఖీ కట్టి సోదర ప్రేమను చాటుకున్నది. మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి పట్టణంలోని వివిధ శాఖల అధికారు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో ప్రభాకర్, డీటీ రాజేశ్, ఎస్సై సతీశ్కుమార్కు రాఖీలు కట్టారు.
గతేడాది అనారోగ్యంతో మృతిచెందిన టీఆర్ఎస్ నాయకుడు బాదావత్ బిక్షం నాయక్ విగ్రహానికి చెల్లెలు బానోత్ బాజ్జు రాఖీ కట్టి తన అనుబంధాన్ని చాటుకున్నది. కూసుమంచి మండల పరిధిలోని మల్లాయిగూడెం పంచాయతీ శివారు హట్యాతండాలో అభిమానులు, కుటుంబ సభ్యులు భిక్షంనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చనిపోయిన అన్న విగ్రహానికి చెల్లెలు రాఖీ కట్టడాన్ని అరుదైన ఘటనగా స్థానికులు పేర్కొంటున్నారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రక్షాబంధన వేడుకలను నిర్వహించారు. ఎర్రుపాలెం సర్పంచ్ అప్పారావుకు పారిశుధ్య మహిళా కార్మికులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.