భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం/ భద్రాచలం/ సత్తుపల్లి/ పెనుబల్లి/ కూసుమంచి, ఆగస్టు 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జోరువాన కురిసింది. రాత్రి వేళ భారీ వర్షం కురవడంతో జనజీవనానికి పెద్దగా ఇబ్బంది కలుగలేదు. తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి ఆయా మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరద చేరింది. వీటిల్లో చాలా వరకు అలుగు పోస్తున్నాయి. జలాశయాలు కూడా నిండుకుండల్లా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 38.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 79.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సింగరేణి మండలంలో 69.6 వేంసూరులో 64.8, ఏన్కూరులో 57.6, ఖమ్మం అర్బన్లో 50.4, కొణిజర్లలో 50.2, పెనుబల్లిలో 49.2, కల్లూరులో 48.4, ఖమ్మం రూరల్లో 48.4, రఘునాథపాలెంలో 45.4, కామేపల్లిలో 44, తిరుమలాయపాలెంలో 41.2, తల్లాడలో 43.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అత్యధికంగా పత్తి పంట రికార్డు స్థాయిలో 2.04 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరినాట్లు సైతం జోరందుకున్నాయి.
సత్తుపల్లి మండలంలో పెద్ద చెరువైన బేతుపల్లి చెరువు 16 అడుగుల గరిష్ఠ నీటిమట్టం దాటి మత్తడి పోస్తోంది. వర్షాల కారణంగా గంగారం – రామానగరం మధ్య రోడ్డుపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి – కాకర్లపల్లి మధ్య ఉన్న గాడిదల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కిష్టారం – చెరుకుపల్లి కాజ్వే వద్ద వరద పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే బేతుపల్లి చెరువు నుంచి ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ కాలువ ద్వారా వేంసూరు మండలంలోని 54 చెరువులకు నీటిని విడుదల చేశారు. అయినా భారీ వర్షం కారణంగా మరోసారి ఉధృతంగా అలుగు ప్రవహిస్తోంది.
పెనుబల్లి మండలంలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన లంకాసాగర్ కూడా ఇప్పటికే అలుగు పారుతోంది. తాళ్లపెంట, చిన్యాతండా, గంగదేవిపాడు, పెనుబల్లి, మండాలపాడు వద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాతోని చెరువు సైతం అలుగుపారుతోంది. పర్యాటక ప్రాంతంగా ఉన్న పులిగుండాల ప్రాజెక్టు సైతం మత్తడి దుంకుతోంది. ఇక కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్కు కూడా వరద పోటెత్తింది.
పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 24.75 అడుగులపైన నీటిమట్టం చేరుకుంది. పాలేరు అలుగుల వద్ద గల 18 గేట్ల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పడుతున్న వర్షాల వల్ల ఉర్లుగొండ దారిలోని లోలెవల్ కాజ్వే పైనుంచి నీరు ప్రవహిస్తోంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 36 అడుగులకు చేరింది. ఆదివారం రాత్రి 8 గంటలకు 29.2 అడుగులుగా ఉన్న గోదావరి సోమవారం ఉదయం 8 గంటలకు 35.8 అడుగులకు చేరుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో 36.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా దమ్మపేటలో 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూలూరుపాడులో 92, అశ్వారావుపేటలో 64, మణుగూరులో 60, ములకలపల్లిలో 52, గుండాలలో 53, దుమ్ముగూడెంలో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.