ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలోని 17 థియేటర్లలో ‘గాంధీ’ చిత్రం ప్రదర్శితం కానున్నది. విద్యార్థులు మహాత్ముని గాథ తెలుసుకుని వారిలో దేశభక్తి భావం పెంపొందించేలా మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు ప్రభుత్వం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నది. తెలుగు, హిందీలో రూపొందించిన ఈ చిత్రం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపనున్నది. జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు సినిమా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గాంధీ సినిమా చూపించాలని నిర్ణయించారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్తో చర్చించి విద్యార్థులకు చిత్రాన్ని చూపించనున్నారు. విద్యార్థులను థియేటర్లకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేయనున్నారు. థియేటర్లలో పిల్లలకు వాటర్ బాటిళ్లు, స్నాక్స్ అందించనున్నారు.
ప్రదర్శన సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకునేందుకు ఒక్కో థియేటర్కు డీఈవో యాదయ్య ఒక ప్రధానోపాధ్యాయుడిని నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఈ నెల 9న, 10న, 11న, 16న, 17న, 18న, 19న, 20న, 21న సినిమా ప్రదర్శితమవుతుంది. తొమ్మిది రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు థియేటర్కు చేరుకునేలా ప్రధానోపాధ్యాయులు, నోడల్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతిరోజూ 17 థియేటర్లలో 9,807 మంది విద్యార్థులు సినిమా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 15 మంది విద్యార్థులను పర్యవేక్షించేందుకు ఒక ఉపాధ్యాయుడు బాధ్యతలు తీసుకోనున్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు థియేటర్ల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు పర్యవేక్షించనున్నారు. ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం డీఈవో యాదయ్య ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లపై చర్చించారు.