ఖమ్మం కల్చరల్/ కూసుమంచి, ఆగస్టు 7: మహ్మదీయుల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పండుగే మొహర్రం. జిల్లాలోని ముస్లింలందరూ ఈ పండుగను మంగళవారం జరుపుకుంటారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగను పది రోజుల పాటు జరుపుతారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుటారు. మొహర్రం నెలలో పది రోజుల పాటు అమరులను స్మరించుకుంటారు. మొహర్రం 10వ రోజు అషురాగా జరుపుకుంటారు.
1400 ఏళ్ల కిందట 60 రోజులపాటు జరిగిన యదార్థ ఘటనకు ప్రతిరూపం ఈ పండుగ. ఖలీఫా హజ్రత్ అలీ తనయులు ఇమామే హుస్సేన్, ఇమామ్ హస్సేన్. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామ్ హసన్ను ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్గా ఉన్న మావియాకు అధికార దాహంతో రాజ్యాధికార కాంక్ష పెరుగుతోంది. దీంతో యుద్ధం ప్రకటించి ఇమామ్ హస్సేన్ను గద్దెదించాలనుకుంటాడు.
యుద్ధంలో పాల్గొంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధతో.. రణ నివారణ కోసం హస్సేన్ తన పదివిని త్యజిస్తారు. మావియా కుట్ర ఫలిస్తుంది. అయితే కొద్ది వ్యవధిలోనే హస్సేన్ విష ప్రయోగానికి గురై హతుడవుతారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ను రాజ్యాధికారిగా నియమిస్తాడు. చర్చల కోసం ఇమామ్ హుస్సేన్ రాజధాని కుఫాకు బయల్దేరుతాడు. యజీద్కు విషయం తెలుస్తుంది. పాషాణ హృదయుడైన అతడు.. ఇమామ్ హుస్సేన్ పరివారాన్ని కర్బల అనే చోట అడ్డగిస్తాడు. తనను రాజుగా అంగీకరించాలంటూ యుద్ధానికి కాలు దువ్వుతాడు.
ఆ విధంగా పది రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హుస్సేన్ పరివారం వీరోచితంగా పోరాడి అశువులుబాస్తరు. హుస్సేన్ ఒక్కరే మిగులుతారు. పదో రోజు హుస్సేన్ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు దొంగచాటుగా వెన్నుపోటు పొడిచి హత్యచేస్తారు. ఆవిధంగా పదో రోజు ‘షహాదత్’ను సంతాప దినంగా పాటించాలని హుస్సేన్ అనుచర వర్గం ప్రకటించింది. అమరవీరులు ఇమామే హుస్సేన్, ఇమామే హస్సేన్ పడిన కష్టాలు, త్యాగాలను స్మరిస్తూ పది రోజులపాటు విషాద దినాలుగా గడుపుతారు. ఈ పది రోజుల పాటు ముస్లిం సోదరులు వారిని స్మరిస్తూ పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పదో రోజు ముగియడంతో ఆ రోజున మొహర్రం పండుగను స్మరణగా జరుపుకుంటారు.
అమరవీరులను స్మరిస్తూ పీర్లను ఊరేగించే మొహర్రం పండుగను జిల్లా అంతటా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల పీర్ల చావిళ్లలోని పీర్లను వీధుల్లో ఊరేగించి ఇమామే హుస్సేన్, హస్సేన్లను స్మరించనున్నారు.