సత్తుపల్లి, ఆగస్టు 8 : మూడు రోజులుగా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో మండలంలోని చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మండలంలో 79.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బేతుపల్లి చెరువు 16 అడుగుల గరిష్ఠ నీటిమట్టం దాటి మత్తడి దుంకుతోంది. వర్షాల కారణంగా గంగారం-రామానగరం మధ్య రోడ్డుపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి-కాకర్లపల్లి మధ్య ఉన్న గాడిదల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కిష్టారం-చెరుకుపల్లి కాజ్వే వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి.
తల్లాడ, ఆగస్టు 8 : పినపాక వద్ద గంగిదేవిపాడు వాగు బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంగాపురం, గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న జూబంధం వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపైకి నీళ్లు చేరడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షానికి చెరువులు అలుగులు పోస్తున్నాయి.
పెనుబల్లి, ఆగస్టు 8 : మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే అలుగు పారుతోంది. తాళ్లపెంట, చిన్యాతండా, గంగదేవిపాడు, పెనుబల్లి, మండాలపాడు వద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాతోని చెరువు సైతం అలుగుపారుతోంది. పులిగుండాల ప్రాజెక్టు వరదనీటితో మత్తడి దుంకుతోంది.
వేంసూరు, ఆగస్టు 8 : కందుకూరులోని లింగగూడెం చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగుపారుతోంది. కందుకూరు-దుద్దేపూడి గ్రామాల మధ్య తుంగావారి కాలనీ వద్ద వంతెనపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండ్రుపాడు వద్ద వంతెనపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కొణిజర్ల, ఆగస్టు 8 : మండలంలోని తీగలబంజర వద్ద గల పగిడేరు వాగు, అంజనాపురం వద్ద ఉన్న పెద్దఏరు, మల్లుపల్లిలోని వాగు పొంగి పొర్లాయి. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వైపు వెళ్లే వాహనాలను పల్లిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలు నిలిపివేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత రాకపోకలు పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి వీచిన గాలులకు లింగగూడెం- గోపవరం గ్రామాల మధ్య ఓ పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. వాహన రాకపోకలు నిలిచిపోగా ఎస్సై యయాతిరాజు తన సిబ్బందితో కలిసి చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.
కామేపల్లి, ఆగస్టు8 : కామేపల్లి, లింగాల, కొండాయిగూడెం పెద్ద చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు పొన్నేకల్ బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. లింగాల- డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.