ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: విద్యార్థులు గాంధీ సినిమా వీక్షించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో పాఠశాలలు, సినిమా హాళ్ల మ్యాచింగ్, బ్యా చింగ్ ప్రక్రియను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 92 వేల మంది ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలోని 17సినిమా హాళ్లలో గాంధీ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామని, ఈ నెల 9నుంచి 11వరకు, ఈ నెల 16నుంచి 21వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు రోజూ ఒక ఆట ప్రదర్శితమవుతుందన్నారు. మ్యాచింగ్, బ్యాచింగ్ విషయంలో పాఠశాలలకు దగ్గర్లో ఉన్న సినిమా హాళ్లు కేటాయించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్, డీఈవో యాదయ్య, జిల్లా రవాణాధిశాఖాధికారి కిషన్రావు, సహాయ సంచాలకులు ఎంవీ చారి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయ ఏడీ నుంచి సూపరింటెండెంట్లు, క్లర్క్ల వరకు డిజిటల్ ‘కీ’లు ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యాలయంలోని సెక్టోరల్ విభాగంలోనే ఉండి మన ఊరు-మన బడితో పాటు గాంధీ సినిమా ప్రదర్శనపై సమీక్షించారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 8: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లకు ఆర్థిక సేవల నిర్వహణకు ఎన్ఆర్ఎల్ఎం కింద బయోమెట్రిక్ యంత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
వీరు బ్యాంకులకు దూరంగా ఉన్న మండలాలు, గ్రామాల్లో బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్డీవో విద్యాచందన, అదనపు డీఆర్డీవో జయశ్రీ, డీపీఎం రేవతి, సీఎస్సీ కోఆర్డినేటర్ ఫయాజ్, మేనేజర్ సురేశ్కుమార్ ఉన్నారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 9: గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిషరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్డేలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తూ, దరఖాస్తులను వారికి పంపించారు. అనంతరం స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులకు సూచనలు చేశారు.
రెండు వారాలు నిర్వహించే వేడుకల షెడ్యూల్ ఆందజేసినట్లు, అన్ని కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, ఎన్.మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.