పల్లె ప్రకృతి వనాలు పచ్చని హారాలయ్యాయి.. అవెన్యూ ప్లాంటేషన్స్ మొక్కలు స్వాగత తోరణాలయ్యాయి.. హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. ఇలా పల్లెలు, పట్టణాలు సుందర వనాలయ్యాయి.. అంతేకాదు గతేడాది అక్టోబర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది.. ఈమేరకు భద్రాద్రి జిల్లాలో వనాలు ఏర్పాటయ్యాయి.. వాకింగ్ ట్రాక్లు, కూర్చునే బల్లలు వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.. కొన్నిచోట్ల ఇప్పటికే పనులన్నీ పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు ప్రతి బృహత్ వనం నందనవనంలా దర్శనమిస్తున్నది.
కొత్తగూడెం అర్బన్, మే 23: హరితహారం పల్లెకు పచ్చందాలు తీసుకువచ్చింది. ప్రతి గ్రామాన్ని నందనవనం చేసింది. ఏడేళ్లలో నాటిన కోట్లాది మొక్కలు గ్రామస్తులకు నీడనిస్తున్నాయి. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయి. ప్రతి పంచాయతీకి నర్సరీ ఏర్పాటు చేయడంతో మొక్కల సేకరణకు ఇబ్బందులు తప్పాయి.
పంచాయతీలు పల్లె ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్కు ఈ నర్సరీల్లో పెరిగిన మొక్కలనే వినియోగిస్తున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వనాల్లో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో ఉదయం సాయంత్రం గ్రామస్తులు వ్యాయాయం చేస్తున్నారు. పిల్లలు ఆటలాడుతూ, వృద్ధులు సేద తీరుతూ కనిపిస్తున్నారు.
ఇప్పటివరకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వనాలు సత్ఫలితాలనిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రతి మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు (బీపీపీవీ) ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. జిల్లావ్యాప్తంగా కొత్తగూడెం పట్టణ మినహా మిగిలిన 22 మండలాల్లో బృహత్ వనాలు సిద్ధమయ్యాయి. సిబ్బంది లక్షలాది మొక్కలను సంరక్షిస్తున్నారు.
ప్రతి మండలంలో 5 నుంచి 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. ఆళ్లపల్లి మండల కేంద్రంలో 6.50ఎకరాల్లో 17 వేల మొక్కలు, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెంలో 8ఎకరాల్లో 24 వేల మొక్కలు, అశ్వాపురం మండలంలోని మల్లెమడుగులో 8 ఎకరాల్లో 12 వేల మొక్కలు, అశ్వారావుపేట మండలంలోని పేరాయిగూడెంలో 8 ఎకరాల్లో 10 వేల మొక్కలు, భద్రాచలంలో 6.01 ఎకరాల్లో 15,140 మొక్కలు, బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్లో 3.5ఎకరాల్లో 9,500 మొక్కలు, చండ్రుగొండ మండలంలోని బెందాలపాడులో 10 ఎకరాల్లో 22 వేల మొక్కలు, చర్లలో 8 ఎకరాల్లో 23,150 మొక్కలు, చుంచుపల్లి మండలంలోని త్రీ ఇైంక్లెన్లో 10 ఎకరాల్లో 31 వేల మొక్కలు, దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెంలో 4.62 ఎకరాల్లో 16 వేల మొక్కలు, దుమ్ముగూడెంలో 3.50ఎకరాల్లో 6 వేల మొక్కలు, గుండాలలో 7.06 ఎకరాల్లో 18 వేల మొక్కలు, జూలూరుపాడులో 7.50 ఎకరాల్లో 15 వేల మొక్కలు, కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లిలో 7.50 ఎకరాల్లో 18 వేల మొక్కలు, లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగులో 7.50 ఎకరాల్లో 16,062 మొక్కలు, మణుగూరు మండలంలోని ముత్యాలమ్మనగర్లో 6.20 ఎకరాల్లో 17 వేల మొక్కలు, ములకలపల్లిలో 8 ఎకరాల్లో 24 వేల మొక్కలు, పాల్వంచలోని బసవతారకం కాలనీలో 8 ఎకరాల్లో 22,500 మొక్కలు, పినపాక మండలంలోని పత్తిరెడ్డిపాలెంలో 8 ఎకరాల్లో 24 వేల మొక్కలు, సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో 10 ఎకరాల్లో 31 వేల మొక్కలు, టేకులపల్లి మండలంలోని 9వ మైలుతండాలో 8ఎకరాల్లో 21 వేల మొక్కలు, ఇల్లెందు మండలంలోని రొంపేడు పంచాయతీలో 8 ఎకరాల్లో 22 వేల మొక్కలు పెరుగుతున్నాయి.
ప్రతి బృహత్ పల్లె ప్రకృతి వనంలో అధికారులు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు వనంలో వ్యాయామం, యోగా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం వాకింగ్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్లో వనాలకు స్థలాలకు భూమి సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వగా జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ చేపట్టారు.
సత్వరం మొక్కలు నాటించారు. ప్రతి బృహత్ వనంలో ముగ్గురు నుంచి ఐదుగురు సంరక్షకులు మొక్కలను సంరక్షిస్తున్నారు. వనాల్లో ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, విప్ప, చందనం, రేగు, కుంకుడు, పనస, చీమచింత, అందుగా, నెమలినార, చింత, ఈత, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మతాటి, వెదురు, జమ్మి, వావిలి, తంగెడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, జీవ కంచ(బయోఫెన్స్), వెదురు, గచ్చకాయ, గోరింట తదితర మొక్కలు పెరుగుతున్నాయి.
దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఇలాంటి బృహత్ పల్లె ప్రకృతి వనాలు లేవు. కేవలం తెలంగాణలోనే ప్రతి మండలానికి ఒక వనం ఏర్పాటైంది. ప్రస్తుతం పనులు తుది దశకు వచ్చాయి. భవిష్యత్తులో ఇవి పిక్నిక్ స్పాట్లు మారే అవకాశం ఉన్నది. సంరక్షకులు ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నారు.
– జి.మధుసూదనరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, కొత్తగూడెం