పాల్వంచ రూరల్, మే 23: ట్రాక్టర్ బోల్తాపడి ఓ మహిళ మృతిచెందగా 44 మంది గాయాలపాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికుంట మూలమలుపు వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం మందెరికలపాడు, పెదకలసకు చెందిన సుమారు 60 మంది గ్రామస్తులు సోమవారం బూర్గంపాడు మండలంలోని టేకులచెరువులో జరుగనున్న వివాహ వేడుకకు ట్రాక్టర్పై బయల్దేరారు.
ఈ క్రమంలో ఇదే మండలంలోని మొండికుంట మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఘటనలో సొడి పాయికి (31) అనే మహిళ ట్రాక్టర్ కింద పడి మృతిచెందింది. 34 మందికి స్వల్ప గాయాలు, 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయాలపాలైన వారిలో సుమారు 15 మంది పిల్లలు ఉన్నారు. ప్రయాణికులు, స్థానికులు క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు, వైద్యసిబ్బంది వారికి వైద్య చికిత్స అందించారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న కలెక్టర్ అనుదీప్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పాల్వంచ తహసీల్దార్ స్వామి, సీఐ సత్యనారాయణ రూరల్, ఎస్సై శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఘటనపై పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ట్రాక్టర్ బోల్తాపడిన తర్వాత డ్రైవర్ పరారైనట్లు పోలీసులు గుర్తించారు.