ఖమ్మం, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నేతలు కల్లబొల్లి మాటలు చేప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారి విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, స్క్రాప్ నేతలకు బుద్ధి చెప్తారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులని, ‘స్కాం’గ్రెస్ నేతలుగా మారడం వల్లే అలాంటి పరిస్థితులు దాపురించాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో స్క్రాప్ నాయకురాలు రేణుకా చౌదరి అని ఎద్దేవా చేశారు. ఆమె ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేకుండా రాజకీయ నాయకురాలు అని భావిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో ఓటర్లకు కనబడని నాయకులు ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి స్క్రాప్ నేతలు కాంగ్రెస్లోనే అధికంగా ఉన్నారన్నారు. రేణుకా చౌదరి ఏనాడూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందివ్వలేదన్నారు. ఓ ఎస్టీ డాక్టర్కు టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఆమె తనకు నీతులు చెప్పే అర్హత లేదన్నారు.
కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరి జిల్లాకు ఒనగూర్చిన ప్రయోజనాలెంటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. పేదల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు కల్లబొల్లి మాటలు చేప్తే ప్రజలు వినేస్థితిలో లేరన్నారు. విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, స్క్రాప్ నేతలకు బుద్ధి చెప్తారన్నారు. తాను మంత్రిగా, శాశనసభ్యుడిగా అభివృద్ధి పనులు చేపడుతున్నానని అన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ఉమ్మడి జిల్లా అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే ఇప్పటివరకు 7,024మందికి రూ.66.36 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందాయన్నారు.
ఖమ్మం నగరవాసులకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందుతుందని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. అనంతరం మంత్రి అజయ్ కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, ఎంపీపీ భుక్యా గౌరి, రఘునాథపాలెం జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.