ఖమ్మం, మే 19: తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) గురువారం నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తోందని పేర్కొన్నారు.