అన్నారుపాడు అభివృద్ధి పనుల్లో అలసత్వం
వైకుంఠధామం పూర్తయ్యేదెన్నడో?
ప్రకృతివనంలో మొక్కల మధ్య పెరుగుతున్న గడ్డి
పూర్తయినా నిరుపయోగంగా డంపింగ్ యార్డు
అడవిని తలపిస్తున్న ‘డబుల్’ ఇళ్ల పరిసరాలు
జూలూరుపాడు, ఏప్రిల్ 11 : నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా కన్పిస్తున్నాయి అక్కడి అభివృద్ధి పనులు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పిల్లర్ల లెవెల్లో ఉన్న వైకుంఠధామం ఎప్పుడు పూర్తవుతుందో అంతుబట్టని విషయంగా ఉంది. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల మధ్య విపరీతంగా కలుపు పెరిగింది. డంపింగ్ యార్డు పూర్తయినా దానిని ఉపయోగించడం లేదు. కంప చెట్లు ఏపుగా పెరగడంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిసరాలన్నీ అడవిని తలపిస్తున్నాయి. మొత్తంగా అక్కడి పనులన్నీ గ్రామస్తులకు పరీక్ష పెడుతున్నాయి.
ప్రతి మనిషి చివరి మజిలీ సజావుగా సాగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మిస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి కారణాల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. జూలూరుపాడు మండలంలోని అన్నారుపాడు గ్రామంలో వైకుంఠధామం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దహన వాటికలు, స్నానాల గదులు, విశ్రాంతి గదుల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతా లోపం కన్పిస్తోంది. వాటర్ క్యూరింగ్ సరిగా లేదు. నెలల తరబడి సాగుతున్న నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. పల్లె ప్రకృతివనంలో సైతం మొక్కలు నాటి వదిలేయడంతో వాటి మధ్యలో పిచ్చిగడ్డి పెరిగి అడవిని తలపిస్తోంది. పల్లె ప్రకృతివనానికి వెళ్లే మార్గంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల చుట్టూ తుమ్మ చెట్లు పెరిగాయి. ఆ ప్రాంతమంతా అడవిలా మారింది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరిగి కారడవిని తలపిస్తున్నాయి. గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.1.70 లక్షలను విడుదల చేస్తోంది. ఈ నిధులతో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంది. కానీ గ్రామంలో కొన్ని వీధులు తప్ప ఎక్కడా పారిశుధ్య పనులు కనిపించడంలేదు. డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయింది. గ్రామంలోని ప్రతి కుటుంబానికీ రెండు చెత్తబుట్టలు ఇచ్చిన అధికారులు, పాలక వర్గ బాధ్యులు తరువాత చేతులు దులుపుకున్నారు. దీంతో వీధుల పక్కనే చెత్తా చెదారం దర్శనమిస్తోంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పనులను పూర్తిచేస్తాం..
‘అసంపుర్తిగా నిలిచిపోయిన పనులను తరగా పూర్తయ్యాలా చర్యలు చేపడతాం.గ్రామంలో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించం. వారానికి రెండు పర్యాయాలు గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలిస్తున్నాం. పంచాయతీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేస్తున్నాం. అయినా నిర్లక్ష్యంంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.’
-డీ.చంద్రశేఖర్, ఎంపీడీవో, జూలూరుపాడు
ఇవి కూడా చదవండి
పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు చూపుతారు