యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు తొలిసారిగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. గృహాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలతోపాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందించనున్నది. ‘మేఘా గ్యాస్ ఇట్స్ స్మార్ట్, ఇట్స్ గుడ్’ ట్యాగ్ లైన్ పేరుతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అందుబాటులోకి రానున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో గ్యాస్ పైపులైన్, సిటీగేట్ స్టేషన్ పనులను పూర్తి చేసి ఇటీవలే ప్రయోగాత్మకంగా పరీక్షించారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ను సరఫరా చేసేందుకు మేఘా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సిటీ గేట్ స్టేషన్ ద్వారా పీఎన్జీ(పైప్డ్ నాచురల్ గ్యాస్)ని గృహ, పారిశ్రామిక అవసరాలకు.. మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ(కాంప్రెస్డ్ నాచురల్ గ్యాస్)ని వాహనాల అవసరాల కోసం అందుబాటులోకి తెస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, మిర్యాలగూడ, కొండమల్లేపల్లి, సూర్యాపేట, కోదాడలో సీఎన్జీ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 32 కిలోలమీటర్ల స్టీల్ పైపులైన్ను వేయగా.. మరో 80 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. అలాగే 40 వేల కుటుంబాలకు, వివిధ పరిశ్రమలకు గ్యాస్ను అందించేందుకు అవసరమైన 500 కిలోమీటర్ల మేర ఎండీపీఈ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.