మామిళ్లగూడెం, మార్చి 19: ఖమ్మం రైల్వే స్టేషన్లో 27 కేజీల గంజాయిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్సై రవికుమార్, ఆర్పీఎఫ్ ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు.. గురువారం ఉదయం రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండో నంబర్ ప్లాట్ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వద్దనున్న రెండు ట్రాలీ బ్యాగులను తనిఖీ చేశారు. వాటిలో (పాక్షికంగా ఎండిన) 27 కేజీల గంజాయి ఉంది. నిందితుడి నుంచి వివరాలు రాబట్టారు.
ఒడిశా రాష్ట్ర గంజామ్ జిల్లా పటానీ సహి, బిక్రమ్పూర్ గ్రామస్తుడు రాజా బెహరా.. తన స్నేహితుడు దీపక్కు తెలిసిన వ్యక్తి నుంచి ఖల్లీకోట్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి ఉన్న ట్రాలీ బ్యాగులను ఈ నెల 17న తీసుకున్నాడు. ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్లో ప్రయాణించి ఖమ్మంలో దిగాడు. ఇక్కడి నుంచి సూరత్కు గంజాయిని తరలించేందుకు నవజీవన్ ఎక్స్ప్రెస్ కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనపర్చుకుని, కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు అప్పగించారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది