ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలోవివిధ రూపాల్లో నిరసన తెలిపినా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై నిర్లక్ష్య వైఖరిని అవలంబించింది. ఆది నుంచి అన్నదాతలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ మరోసారి వారికి భరోసా కల్పిస్తూ వారు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 158 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి 65 కేంద్రాల నుంచి 12,603 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇప్పటివరకు 1,517 మంది రైతులు ధాన్యం విక్రయించగా.. 1,117 మంది రైతులు బ్యాంకు ఖాతాల్లో రూ.16 కోట్ల నగదు జమ అయింది.
అశ్వారావుపేట, మే 19: భద్రాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 158 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం నాటికి 65 కేంద్రాల నుంచి 12,603 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ఇప్పటివరకు 1,517 మంది రైతులు ధాన్యం విక్రయించగా ఇప్పటికే 1,117 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.16 కోట్ల నగదు జమ అయింది. గత నెల 18న ధాన్యం సేకరణ ప్రారంభం కాగా నెలాఖరు లోపు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 33,250 ఎకరాల నుంచి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి సాగు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఈ సారి రైతులు కేవలం 23,250 ఎకరాల్లోనే వరి సాగు చేశారు. మరో 10 వేల ఎకరాల్లో విత్తన వరి పండించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు ససేమిరా అనడంతో తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి ఇబ్బంది పడతారని తెలిసి సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతులు ధాన్యం విక్రయించడానికి ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎక్కడికక్కడ స్థానికంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించారు. రైతులు ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందుతున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయికి వెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. తూకాల్లో తేడా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణ నుంచి మిల్లుల్లో ధాన్యం దిగుమతి అయ్యే వరకు పారదర్శకంగా ప్రక్రియ చేపడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం అక్రమంగా రాష్ర్టానికి రానీయకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.
సేకరణ కేంద్రాల్లో ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తున్నది. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. ధాన్యం సేకరణపై కేంద్రం ప్రభుత్వ సహకారం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వమే సేకరించడం హర్షణీయం. రైతుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కూనా రామకృష్ణ, రైతు, వేదాంతపురం
ఇప్పటివరకు 65 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాం. రూ.16 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేయించాం. నగదు చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరగడం లేదు. నెలాఖరు లోపు లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం.
– ప్రసాద్, డీసీఎస్వో, కొత్తగూడెం