నేలకొండపల్లి, ఫిబ్రవరి 10: పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నేలకొండపల్లి బాలసముద్రం చెరువుకు మిషన్ కాకతీయ పథకంలో నిధులు మంజూరు చేస్తే దాని పనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ మన్మథరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇతర ట్యాంకుబండ్ నిర్మాణాల పనులు పూర్తిచేస్తుంటే ఇది ఎందుకు పూర్తి కావడం లేదంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
నేలకొండపల్లి మండలంలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్.. తొలుత బాలసముద్రం మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు. అనంతరం భౌద్ధస్తూపంలో నిర్మిస్తున్న భవనాలను పరిశీలించి పనులను వేగవంతగా పూర్తి చేయాలని సూచించారు. ధ్యాన మందిరంలో నిర్మిస్తున్న ఆడిటో రియం పనులను పరిశీలించారు. అనుకున్న సమయానికి వాటిని అప్పగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఎంఈవో, హైస్కూల్ హెచ్ఎంలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కలెక్టర్ వచ్చినా మండల అధికారులు రారా?’ అంటూ ప్రశ్నించారు. ‘మన బడి’ పనులు వెనుకబడి ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నేలకొండపల్లిలోని కంటివెలుగు శిబిరాన్ని సందర్శించి అక్కడ పరీక్షలు చేయించుకుంటున్న వారితో మాట్లాడారు. అక్కడ కలెక్టర్ స్వయంగా కళ్లద్దాలను అందించారు. నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువును పరిశీలించి దాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని సూచించారు. కట్టపైన పశువులను కట్టివేయడం చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పక్కన చెరువుకట్ట ఉండడం వల్ల దాన్ని పార్కుతోపాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, జిల్లా పర్యాటకశాఖ అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాదు, సర్పంచ్లు రాయపూడి నవీన్, ఉన్నం బ్రహ్మయ్య అధికారులు పాల్గొన్నారు.