మామిళ్లగూడెం, జూలై 1: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పాల్గొనాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో రానున్న 15 రోజులు కీలకమని, ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని కోరారు.
ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వాటిని పూరించిన తరువాత స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఈ దశలో బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.78 శాతం పూర్తయిందన్నారు. దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు.
రాజకీయ పార్టీల బీఎల్ఏలు క్రియాశీలకంగా ఉండి వివరాల సేకరణలో సహకరించాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితా ఎవరి పేరు లేకపోయినా తప్పనిసరిగా అభ్యంతరం నమోదు చేయాలని, అభ్యంతరం నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి అర్హమైన ఓటరు ఓటు హక్కు కొనసాగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి సహకారంఅందించాలని కోరారు. ఎస్డీసీ సదానందం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ అన్సారీ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.