కూసుమంచి/ కూసుమంచి రూరల్, నవంబర్ 27: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూసుమంచి మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన ఆయన తొలుత పాలేరులోని స్వయం సహాయక సంఘం ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం ఎలా వస్తోందని, తేమ శాతం ఎంత ఉంటోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్ల విషయగురించి స్వయం సహాయక సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు సమాధానమిస్తూ.. ఇప్పటి వరకు 2,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని, దానిని ఆరు లారీల్లో పంపించామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లలో ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతోనూ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. 17 ఏళ్లు నిండిన వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని అన్నారు. మండలంలోని పాలేరు, నేలపట్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అక్కడి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు.
అపరిశుభ్రతపై ఆగ్రహం
మండలంలోని నేలపట్ల జడ్పీఎస్ఎస్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ వీపీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని బీఎల్వో కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. ఆవరణలో మొత్తం పిచ్చిమొక్కలు ఉండడాన్ని గమనించి సర్పంచ్ రెంటాల ధనమ్మ, కార్యదర్శి కోటిలపై మండిపడ్డారు. ఇలా అపరిశుభ్రంగా ఉంచితే ఎలా అంటూ స్వయంగా తానే కొన్ని పిచ్చిమొక్కలను తొలగించారు. ఆదనపు కలెక్టర్ మధుసూదన్, ఎస్డీసీ దశరథం, డీఆర్డీవో విద్యాచందన, డీసీవో విజయకుమారి, ఎంపీవో రాంచందర్, ఏపీవో సత్యవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.